మామిళ్లగూడెం, జనవరి 10 : ఖమ్మం జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్, బుగ్గవాగు సాగు నీటి ప్రాజెక్టుల భూ సేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలేరు లింక్ కాల్వ క్రింద చేపట్టాల్సిన 1,717.35 ఎకరాలకు 1,570 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసి అవార్డ్ పాస్ చేయడం జరిగిందని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్యాకేజి-53, ప్యాకేజి-54కు జిల్లా పరిధిలో ఇంకా 34.20 ఎకరాల భూ సేకరణ పూర్తి చేయాలన్నారు.
ఈ భూ సేకరణ పనులు పూర్తి చేసి, పాలేరుకు గోదావరి జలాలను తరలించేందుకు చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు. సత్తుపల్లి ట్రంక్ కాల్వకు 325.30 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసి అవార్డ్ పాస్ చేశామన్నారు. మున్నేరు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ నిమిత్తం వ్యవసాయ, వ్యవసాయేతర భూమి ఎంత సేకరించాలో నివేధిక సమర్పించాలన్నారు. వ్యవసాయేతర భూమిని గజాల్లో, వ్యవసాయ భూమిని ఎకరాల్లో చూపాలన్నారు. రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై గ్రామాల వారీగా సమీక్ష చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఇరిగేషన్ సీఈ విద్యాసాగర్, డిప్యూటీ సీఈ ధన్కుమార్ రెడ్డి, ఎస్ఈలు ఆనంద్, శ్రీనివాసరెడ్డి, ఆర్డీవోలు జి.గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఈఈలు, కలెక్టరేట్ భూ సేకరణ విభాగ పర్యవేక్షకులు రంజిత్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.