సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు యాజమాన్యంతో మాట్లాడి క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 38,340 ఎన్సీడబ్ల్యూఏ (నేషనల్ కోల్ వేజస్ అగ్రిమెంట్) క్వార్టర్లన్నింటికీ కనెక్షన్లు ఇస్తున్నది. అందుకు రూ.60 కోట్లకుపైగా నిధులు వెచ్చించింది. ఇప్పటికే 6,560 క్వార్టర్లలో ఏర్పాటు చేసుకోగా, 27,474 క్వార్టర్లకు యాజమాన్యం కనెక్షన్ పాయింట్ గుర్తించింది. 11,494 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అలాగే గతంలో ఇచ్చిన మరో హామీ.. నామమాత్రపు కరంట్ బిల్లుల వసూళ్లనూ ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది. దీంతో ఉచిత విద్యుత్ సరఫరాతో కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
– కొత్తగూడెం సింగరేణి, మార్చి 10
ప్రకృతికి విరుద్ధంగా సింగరేణి గనుల్లో ఉత్పత్తి చేసి, తిరిగి ఇంటికి వచ్చిన కార్మికులు కరంట్ కోతలతో ఉక్కిరిబిక్కిరై చెట్లను ఆశ్రయించేవారు. సరైన నిద్రలేక మళ్లీ విధులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఒక వైపు కరంట్ కోతలు.., మరో వైపు ఆఫీసర్లకు మాత్రమే ఏసీ సౌకర్యం ఉండేది. కార్మికుల క్వార్టర్లకు ఆ సదుపాయం లేదు. ఇదీ గత పాలకుల హయాంలో నల్ల సూర్యుల దుస్తితి. అయినా కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించడంలో గత కార్మిక సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయి. కానీ, ప్రత్యేక రాష్ట్రంలో కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు కృషిచేస్తున్నది. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కృషితో అన్ని సౌకర్యాలు వారికి అందుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు వీలైనంత మేలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తలంచారు. ఇదే క్రమంలో కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఆ కళను నెరవేర్చింది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని 38,340 ఎన్సీడబ్ల్యూఏ (నేషనల్ కోల్ వేజస్ అగ్రిమెంట్) క్వార్టర్లన్నింటికీ ఏసీ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించింది. అందుకు రూ.60 కోట్లకు పైగా నిధులు వచ్చించింది. కాగా, ఇప్పటి వరకు 6,560 క్వార్టర్లకు ఏసీలను అమర్చారు. అలాగే 27,474 క్వార్టలకు ఏసీ కనెక్షన్ పాయింట్ ఏర్పాటు చేశారు. 11,494 క్వార్టర్లకు ఏసీలు అమర్చుకునేందుకు దరఖాస్తులు వచ్చాయి.
గతంలో జాతీయ కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందం ప్రకాం కార్మికుల జీతాల నుంచి నామమాత్రపు కరంట్ బిల్లులను వసూలు చేశారు. కాగా, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆ నామమాత్రపు బిల్లుల వసూళ్లను కూడా పూర్తిగా రద్దు చేశారు. ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. ఏడాదికేడాది ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాజమాన్యం కల్పించిన ఏసీ సౌకర్యంతో కార్మికులు కంటినిండా నిద్రపోతున్నారు.
సింగరేణి యాజమాన్యం ఎన్సీడబ్ల్యూఏ కార్మికుల క్వార్టర్లకు కూడా ఏసీ సౌకర్యం కల్పించడం చాలా సంతోసంగా ఉంది. గతంలో డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎండ వేడిమి నుంచి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కరెంట్ కోతలు లేకపోవడం వల్ల, యాజమాన్యం ఏసీ సౌకర్యం కల్పించడంతో హాయిగా సేద తీరుతున్నాం. అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ద తల్లిదండ్రుల కోసం అనుమతి మేరకు మరొక ఏసీ సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటుంది.
– కే రాంచందర్, జనరల్ మజ్దూర్ ఐఈడీ, హెడ్డాఫీస్
సీహెచ్పీలలో పనిచేసే సమయంలో నిత్యం దుమ్ముధూళి, ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ యాజమాన్యం సూచించే రక్షణ చర్యలు పాటిస్తూ బొగ్గు రవాణాకు కృషి చేస్తుంటాం. సీహెచ్పీలలో పనిచేసే కార్మికులందరూ పని ముగిసేంత వరకు ఎలాంటి రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఇంటికి వస్తే ఫ్యాన్, కూలర్ గాలి సరిపోక తీవ్ర అవస్థలు పడేవాళ్లం. ప్రస్తుతం యాజమాన్యం ఏసీ సౌకర్యం కల్పించడం వల్ల డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత సక్రమంగా రెస్ట్ తీసుకోగలుగుతున్నాం.
– కే చుక్కయ్య, సీవోపీ, జేవీఆర్ వోసీ