Sasar pit | కొణిజర్ల, మే 7 : వేసవి వచ్చింది.. అటవీ జంతువులు తాగునీటి కోసం తహతహలాడుతున్నాయి. అగ్ని ప్రమాదాల బారినపడి చెట్లు మాడిపోతున్నాయి. జంతువుల దాహార్తి తీర్చేందుకు.. అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మండుతున్న ఎండల నేపథ్యంలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు సాసర్ పిట్స్ ఏర్పాటు చేయగా.. అకాల మంటలతో దహనమవుతున్న అడవులను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన ఫైర్లైన్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి.
గతంలో నీరు దొరకక జనావాసాల్లోకి వస్తూ.. వీధి కుక్కల బారినపడుతూ.. రోడ్లు దాటుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాలను కాపాడుకునేందుకు సాసర్పిట్స్(నీటితొట్లు) ఏర్పాటు చేయడంతో వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాయి. రెండు రోజులకోసారి వాటర్ ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి సాసర్పిట్లలో నింపుతూ మూగజీవాల దాహం తీరుస్తున్నారు. దీంతోపాటు అటవీ ప్రాంతాల్లో సంచరించే స్థానికులు, గొర్రెలు, బర్రెల కాపరులు పొగతాగే సమయంలో నిర్లక్ష్యంగా కాల్చిన చుట్ట, బీడీలను అడవిలో పడేస్తున్నారు. ఈ క్రమంలో నిప్పంటుకుని రోజులకొద్దీ అడవి దహనమయ్యే సంఘటనలు అనేకం చూశాం. పై రెండు ఘటనల నుంచి నివారణ కోసం పకడ్బందీ వ్యూహం.. పక్కా ప్రణాళికతో తెలంగాణ అటవీ శాఖ ముందుకెళ్తున్నది.
రెండు డివిజన్ల పరిధిలో..
జిల్లాలో ప్రధానంగా ఖమ్మం, సత్తుపల్లి రెండు డివిజన్లుగా అడవి విస్తరించి ఉంది. ఖమ్మం డివిజన్ పరిధిలో ఖమ్మం, మధిర, కారేపల్లి, కూసుమంచి రేంజ్లు ఉండగా.. సత్తుపల్లి డివిజన్లో తల్లాడ, సత్తుపల్లి, దమ్మపేట రేంజ్లు ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 7 రేంజ్లలో అటవీ శాఖ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొణిజర్ల మండలంలో కొణిజర్ల, గుబ్బగుర్తి అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా.. నూతనంగా గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో 12 సాసర్పిట్స్ ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అలాగే అకాల మంటలతో అడవి దహనం కాకుండా ఎక్కడికక్కడ కిలోమీటర్ల పొడవున ఫైర్లైన్స్ సైతం ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మంటలు అంటుకున్నప్పుడు ఫైర్లైన్స్ వద్దకు వచ్చే సరికి అప్రయత్నంగానే మంటలు చల్లారిపోయేందుకు దోహదపడనున్నాయి.
పాదముద్రలతో వన్యప్రాణుల గణన
మూగజీవాలకు నీటి వనరుగా ఉన్న సాసర్పిట్ల వద్దకు వచ్చే వన్యప్రాణులు ఏయే జంతువులు.. ఎంతమేర ఉన్నాయి.. అనే విషయాలు పాదముద్రల ద్వారా తెలుసుకునేందుకు సాసర్పిట్లు దోహదపడనున్నాయి. ప్రధానంగా జిల్లాలో అడవి పందులు, దుప్పులు, జింకలు, కొండగొర్రెలు, మనుబోతులు, నెమ్మళ్ల్లు ఉన్నట్లు అటవీ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా.
అడవిని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు
అటవీ ప్రాంతంతోపాటు వన్యప్రాణులను కాపాడుకునేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. అటవీ ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, పూర్తిగా నీరు లేని ప్రాంతాలను గుర్తించి అక్కడ సాసర్పిట్లు ఏర్పాటు చేశాం. వీటిలో అవసరానికి అనుగుణంగా రెండురోజులకొకసారి నీటిని నింపి మూగజీవాల దాహార్తి తీర్చుతున్నాం. ఎప్పటికప్పుడు అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ముందస్తుగానే ఫైర్లైన్స్ ఏర్పాటు చేశాం.
– తేజావత్ రామ, ఎస్హెచ్వో, కొణిజర్ల