పాల్వంచ/ పాల్వంచ రూరల్, ఏప్రిల్ 2: ఈవీఎం కనెక్షన్పై అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈవీఎం పరికరాల పనితీరు గురించి పీవో, ఏపీవోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి డెమో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని అన్నారు. పోలింగ్ రోజున పూరించాల్సిన 17సీ , పీవో డైరీ, పీవో రిపోర్టులతోపాటు ఈవీఎం కనెక్షన్ మీద స్పష్టమైన అవగాహన ఉండాలని పేర్కొన్నారు.
ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సిబ్బంది వ్యవహరించాలని ఆదేశించారు. ఈ రోజున నిర్వహిస్తున్న మొదటి శిక్షణ కార్యక్రమానికి కొత్తగూడెం నుంచి 275 మంది, అశ్వారావుపేట నుంచి 264 మంది, ఇల్లెందు నుంచి 225 మంది, పినపాప నుంచి 260 మంది, భద్రాచలం నుంచి 209 మంది కలిపి మొత్తం 1,233 మంది హాజరుకావాల్సి ఉందని తెలిపారు. అయితే ఇందులో 48 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు దామోదర్రావు, కుసుమకుమారి, సుమ, శ్రీనివాస్, వివేక్, ఎర్రం చిన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు.