ఒకప్పుడు మనం నిత్యం వినియోగించే వస్తువులు, ఆడుకునే బొమ్మలు విసుర్రాయి, కిరోసిన్ ఆయిల్ దీపం, మట్టిపాత్రలు, పడక కుర్చీ, ల్యాండ్ ఫోన్, రాగి బాయిలర్, ఉట్టి, బంకమట్టి బండ్లు, టైప్ మిషన్, గోలీలు, పోస్టుకార్డు, గిరక బావి, కచ్చరం, బాడిసె, పట్టుకారు, సున్నం గాబు, రేడియో ఇలాంటివెన్నో. కానీ ప్రపంచం మారుతున్నది.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నది.. రోజుకో గ్యాడ్జెట్ మార్కెట్లోకి వస్తున్నది.. ఇదే ఒరవడిలో మనం వినియోగించే వస్తువులు మారుతున్నాయి. పాతవాటి స్థానంలో కొత్తవి ఇంట్లో వచ్చి చేరుతున్నాయి. పాతవి కనుమరుగయ్యాయి. గడిచిన 20 ఏళ్లలో వచ్చిన ‘వస్తు విప్లవం’లో చరిత్రకు ఆనవాైళ్లెన, మన పూర్వీకుల జీవన శైలికి ప్రతీకలైన ఎన్నో వస్తువులు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఆ గతకాలపు జ్ఞాపకాలు, అపురూప వస్తువులపై ‘నమస్తే’ నేటి సండే స్పెషల్.
– కూసుమంచి, ఆగస్టు 26
కూసుమంచి, ఆగస్టు 26 : మారుతున్న కాలంతోపాటు మనం వాడే వస్తువులు కూడా మారుతున్నాయి. పాతవాటి స్థానంలో కొత్తవి రూపం మార్చుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో పాతవి కనుమరుగయ్యాయి. మరీ ఈ రెండు దశాబ్దాల నుంచి ‘వస్తు విప్లవం’ మాటలకందని స్థాయికి వెళ్లింది. నాటి నుంచి మిగిలిపోయిన అలాంటి వస్తువులు ఇప్పుడు చరిత్రకు ఆనవాళ్లుగా మిగులుతున్నాయి. తాత ముత్తాతల జీవన శైలికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. విసుర్రాయి, కిరోసిన్ ఆయిల్ బుడ్డి దీపం, మట్టిపాత్ర, పడక కుర్చీ, ల్యాండ్ ఫోన్, రాగి బాయిలర్, ఉట్టి, బంకమట్టి బండ్లు, టైప్ మిషన్, గోలీలు, పోస్టుకార్డు, గిరక బావి, కచ్చరం, బాడిసె, పట్టుకారు, సున్నం గాబు, రేడియో ఇలాంటివన్నీ ఇప్పుడు గతకాలపు జ్ఞాపకాలే. ఒకవేళ మన ఇంట్లో ఉంటే మన తీపి గుర్తులే.
నాటి ఉదయం..
ఒకప్పుడు ఒక సగటు కుటుంబం ఉదయం ఎలా మొదలయ్యేదంటే తెల తెలవారకముందే అమ్మ నిద్ర లేచేది. లేచి ముందుగా కిరోసిన్ ఆయిల్ దీపాన్ని ఆర్పివేసేది. కొబ్బరి చీపురుతో ఇంటి ఆవరణను శుభ్రం చేసేది. పేడ నీళ్లతో ఇంటి ఆవరణను కళ్లాపు చల్లేది. కట్టెల పొయ్యిపై మట్టి పాత్రలో జొన్నన్నమో సజ్జన్నమో వండేది. పిల్లలు అప్పుడప్పుడే నిద్రలేచేవారు. అమ్మ వారి చేతిలో ఇటుకపొడి లేదా బొగ్గు చేతిలో పెట్టేది. పిల్లలు సున్నపు గోళెం వద్దకు వెళ్లి పళ్లు తోముకునేవారు. నేపథ్యంలో రేడియో నుంచి వార్తలు మొదలయ్యేవి. రేడియో నుంచి మాటలు స్పష్టంగా వినిపించాలని నాన్న పడక్కుర్చీలో కూర్చొని ట్యూన్ చేసే పనిలో ఉండేవాడు. పిల్లలు దంత ధావన తర్వాత స్టీలు పళ్లేలు పట్టుకుని వరుసగా కుర్చొనేటోళ్లు. అమ్మ ఒక్కో పళ్లెంలో ఉడుకుడుకు గటక పోసేది. గటక లేకపోతే ఇక ఆ రోజుకు చద్ది అన్నమే దిక్కు. కాస్త పెద్ద పిల్లలు గిరక బావి వద్దకు వెళ్లి గోళేలు, తపాలాల్లో నీళ్లు నింపేవారు. అమ్మ రాగి బాయిలర్లో వేన్నీళ్లు పెట్టి పిల్లలకు స్నానం చేయించేది. ఇక పిల్లలు బడికిపోయిన తర్వాత అమ్మ ఇంటి పనుల్లో నిమగ్నమయ్యేది. చాటల్లో బియ్యం ఇంట్లోని కాగుల్లో దాచిన వడ్లు, జొన్నలు, సజ్జలను విసుర్రాయిలో వేసి విసిరేది. పెరుగు, మజ్జిగ, వండిన కూడు, కూర ఎలుకలు, పిల్లుల పాలు కాకుండా ఉట్టికి వేలాడదీసేది.
సంపన్నుల ఇండ్లలోనే.. ల్యాండ్ ఫోన్
నాడు ఎవరో సంపన్నుల ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది. ల్యాండ్ ఫోన్ నుంచి అవతలి వారికి ఫోన్ చేయాలంటే ఒక్కో నంబరును డయల్ చేయాల్సి వచ్చేది. అలా రింగ్ చేస్తున్నప్పుడు వచ్చే శబ్దం లయబద్ధంగా ఉండేది. ఒకవేళ అవతలి వారి నుంచి ఫోన్ వచ్చినా శబ్దం అలాగే ఉండేది. ఒకరి ఇంట్లో ల్యాండ్ఫోన్ ఉందంటే అప్పట్లో గొప్ప స్టేటస్. ల్యాండ్ ఫోన్ కనెక్షన్ సాధించడమూ పెద్ద ప్రహసనం. అప్పట్లో ఎమర్జెన్సీ విషయాలన్నీ ఈ ఫోన్ల ద్వారానే వెళ్లేవి. ముఖ్యంగా చావులు, అనారోగ్య సమాచారాలు ల్యాండ్ఫోన్లకే వచ్చేవి. ఫోన్ ఇంట్లో ఉన్న వారు మానవతా దృక్పథంతో ఇరుగు పొరుగు వారికి ఫోన్ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేవారు. ఎమర్జెన్సీ లేదు. ఇక ఏదైనా సాధారణ సమాచారమైతే ఉత్తరం రాయడమే గతి. ఉత్తరం ఇంటికి వచ్చిందంటే ఇంటిల్లిపాది చదివేందుకు ఆసక్తి చూపేవారు.
పిల్లల ఆటల వైభవం..
ఇప్పుడంటే అందరి చేతులో మొబైల్స్, ట్యాబ్స్ వచ్చి పిల్లలంతా ఇంటికే పరిమితమవుతున్నారు.. కానీ నాడు ప్రతి వీధిలో సందడి కనిపించేది. బొంగరాలట, గోలీలాట, కోతికొమ్మచ్చి ఆడేవారు. ఇంట్లో పక్కనేసిన చీరెలను చెట్టు లేదా ఇంటి దూలానికి వేలాడదీసి ఉయ్యాల ఊగేటోళ్లు. ముంజలు తీసేసిన తాటికాయలు, బంకమట్టితో బండ్లు చేసి నడిపేటోళ్లు. పాత సైకిల్ టైర్ను రోడ్డుపైకి తీసుకొచ్చి వాటిని కర్రతో తిప్పుతూ, టైర్ వెంట పరిగెడుతూ కనిపించేవారు. ఆడపిల్లలైతే అచ్చెన గిల్లలు, అష్టాచెమ్మా ఆడేందుకు ఆసక్తి చూపేవారు. అవి ఆడడానికి మట్టిలో గుండ్రని రాళ్లు, పెద్ద చింతగింజలు వెతికేపనిలో ఉండేవారు. ఆ ఆటలన్నీ నాడు వారికి వ్యాయామంలా ఉండేవి.
వీధి అరుగులపై సందడి..
నాడు ప్రతి ఇంటి ముందు రాళ్ల అరుగు ఉండేది. అక్కడే అమ్మలు.. అక్కలు అంతా ఒకచోట చేరేవారు. అక్కడి నుంచే కూరలు పంచుకునేవారు. అమ్మలు ఆడపిల్లలకు గోరింటాకు పెడుతూ, రిబ్బను జడలు వేస్తూ కనిపించేవారు. అక్కడ కూర్చునే అమ్మలు వీధికి వచ్చిన బేరగాళ్లతో బేరం చేసి కూరగాయలు, వంట పాత్రలు కొనేటోళ్లు. నాన్నలు, చిన్నానలు, దయాదులందరూ ఇక్కడ కూర్చునే ముచ్చట్లు చెప్పుకునేటోళ్లు. రైతుల ఇళ్లలో సాగుకు పనికివచ్చే ప్రతి వస్తువు ఉండేది. ఇంటి ముందు ఎడ్లబండి ఉండి, రెండెడ్లు ఉంటే ఎంత వైభవమో. నాడు ప్రతి ఇంట్లో ప్రకృతి సిద్ధంగా చేతివృత్తిదారులు తయారు చేసిన వస్తువులే ఉండేవి. అవి కూడా పర్యావరణ హితంగా ఉండేవి. ఇప్పుడు అలాంటి వస్తువులన్నీ హోటళ్లు, రెస్టారెంట్లలో కనిపిస్తున్నాయి. అది వినియోగదారులను ఆకర్షించడానికి అని వేరే చెప్పనక్కర్లేదు. నాటి వస్తువు నేడు అపురూపం అనడానికి ఇంకేం చెప్పనక్కర్లేదు.
మట్టి కుండల్లో వండే వాళ్లం..
నాకు వంద సంవత్సరాలు దెగ్గర పడుతున్నయ్. అప్పట్లో అన్నీ మట్టి కుండల్లోనే వంట చేసే వాళ్లం. గడియారాలు లేవు పొద్దును బట్టి సమయం తెలిసేది. కార్డు ముక్క వస్తే మునుసుబు దెగ్గరికి పోయి చదివించటోళ్లం. డబ్బులు. నగలు కాగుల్లో దాచుకొనేటోళ్లం. బస్సులు లేవు ఎక్కడికి పోయినా కాలినడకే. కోడిగుడ్డు దీపాలతో రాత్రిళ్లు గడిపేవాళ్లం. నీళ్లు దొరికేవి కావు, వంతు వారీగా బావుల వద్ద ఉండి తెచ్చుకుంటోళ్లం. ఏ కాలానికి ఆ కాలం పండ్లు తినేటోళ్లం. పొదాక పని చేయడం, పొద్దుకూకెటాలకి నిద్రపోయి తొలి కోడి కూసేసరికి లేచి పనులు చేసుకునేటోళ్లం. ఎసంటి జబ్బులు ఉండేవి కావు. జ్వరం వస్తే లంకణం చేసి, గటక తాగితే తగ్గేది. కారప్పొడి ఏసుకొని అన్నం తినేటోళ్లం. ఇప్పడంతా మారింది ఆ కాలం కల్మషం లేని ఆ రోజులే బాగున్నాయి. కష్టపడి పని చేసేవాళ్లం. కంటి నిండా నిద్ర పోయేవాళ్లం. ఇప్పుడంతా సుకానికి అలవాటైర్రు. మంచి మర్యాదలు కరువైనయి.
– మందా భద్రమ్మ, వృద్ధురాలు