ఖమ్మం, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలోని మున్నేరుపై త్వరలో అద్భుతం కనిపించనున్నది. సర్కార్ రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నది. హైదరాబాద్లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన తరహాలో నిర్మాణం జరుగనున్నది. మంత్రి అజయ్ కృషితో నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సోమవారం నుంచి టెండర్ ప్రక్రియ కూడా షురూ అయింది. ఈ నెల 28 వరకు ప్రక్రియ కొనసాగనున్నది. ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి విచ్చేసి కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. జనవరి 18న ఖమ్మంలోని మున్నేరుపై బ్రిడ్జి నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రకటన ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే ఆర్అండ్బీశాఖ నుంచి రూ.180 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చారు. 420 మీటర్ల పొడవునా నిర్మించిన ఈ బ్రిడ్జి 300 మీటర్ల వరకూ కేబుల్స్పై నిలిచేలా, మిగతా 120 మీటర్ల వంతెన ఆర్సీసీపై ఉండేలా నిర్మాణం జరగనున్నది.
మున్ముందు పర్యాటక రంగ అభివృద్ధి..
నగరానికి తూర్పున ఉన్న లకారం ట్యాంక్బండ్ ఇప్పటికే పర్యాటకంగా అభివృద్ధి చెందింది. ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి సేదతీరుతున్నారు. మున్నేరుపై తీగల వంతెన పూర్తయితే ఆ ప్రాంతం ట్యాంక్బండ్లా పర్యాటక ప్రాంతంగా మారనున్నది. మరోవైపు మున్నేరుకు రూ.700 కోట్లతో రెండువైపులా నిర్మించే ఆర్సీసీ వాల్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది.
మడమ తిప్పని మంత్రి అజయ్..
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచారు. గతంలో ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏ ప్రజాప్రతినిధి కూడా అభివృద్ధిని పట్టించుకోలేదు. పువ్వాడ అజయ్కుమార్ ఎమ్మెల్యేగా గెలిచి, సీఎం కేసీఆర్ క్యాబినెట్లో స్థానం సంపాదించి, నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు తీసుకొచ్చారు. కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టారు. మంత్రి కృషితో నగరానికి కొత్త బస్టాండ్, ఐటీ హబ్, ధంసలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి, గోళ్లపాడ్ చానల్ ఆధునీకరణ పూర్తయింది. వైకుంఠ ధామాలు, విశాలమైన రోడ్లు, పార్క్లు, లకారం ట్యాంక్బండ్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, జంక్షన్లు, పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి.