కూసుమంచి, ఫిబ్రవరి 16: కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ప్రతిష్ఠించిన శివలింగం.. నాటి కళానైపుణ్యానికి మచ్చుతునక. ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక కూసుమంచి సమీపంలోని గణపేశ్వరుని ఆలయం. వెయ్యి ఏళ్ల నుంచి మహాశైవ క్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారమైంది. శివరాత్రి సందర్భంగా శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఆలయం ముస్తాబైంది. రాత్రి 10 గంటలకు వేడుక ప్రారంభమై అర్ధరాత్రి ముగుస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ కొక్కిరేణి వీరస్వామి, సర్పంచ్ చెన్నా మోహన్, ఈవో శ్రీకాంత్, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచీ భక్తులు వస్తారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
దాతల సాయంతో జీర్ణోద్ధరణ..
దేశంలోని అతి పెద్ద శివ లింగాకారాల్లో ఒకటి గణపేశ్వరుని ఆలయంలోని లింగం. ఉదయం సూర్యుడి ఉదయించిన తర్వాత సరాసరి ఆ కిరణాలు శివలింగంపై పడడం నాటి స్థపతుల శిల్ప చతురత. కాకతీయుల కాలంలో కృపామంచిగా విరాజిల్లిన గ్రామం నేడు కూసుమంచిగా మారింది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ప్రకృతి వైపరీత్యాలకు కొన్నేండ్ల క్రితం వరకు శిథిలావస్థలోనే ఉండేది. తర్వాత దాతలు ముందుకొచ్చి జీర్ణోద్ధారణ చేపట్టారు. గతంలో కూసుమంచి సీఐగా పని చేసిన సాధు వీరప్రతాపరెడ్డి ఆలయ అభివృద్ధికి సొంత నిధులు వెచ్చించారు. ఒకప్పుడు ఆలయానికి సెంట్ భూమైనా ఉండేది కాదు. దాతలు ముందుకొచ్చి రెండెకరాల స్థలాన్ని అందించడంతో దానిపై వచ్చిన సొమ్ము ఆలయ వేడుకలకు ఉపయోగపడుతున్నది.
ఆలయ చరిత్రను ఉపాధ్యాయుడు కట్టా శ్రీనివాసరావు అచ్చు వేయించి భక్తులకు పంచారు. ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ ఆలయమూ గతంలో శిథిలావస్థలో ఉండేది. దాతలు ముందుకొచ్చి ఆలయ అభివృద్ధికి విరాళాలిచ్చారు. ఆ సొమ్ముతో ఆలయంలో నవగ్రహాలు, సరస్వతిదేవి మందిరం, లింగాకార మందిర ప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు ఆంజనేయునికి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. గణపేశ్వరుని ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్తో పాటు ఎంతో మంది దాతలు భూరి విరాళాలిచ్చారు.
ఆలయ అభివృద్ధికి కృషి..
నేను కూసుమంచిలో సీఐగా పనిచేస్తున్న సమయంలో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాలని నిర్ణయించుకున్నా. నాడు శివరాత్రి సందర్భంలో పట్టుమని పది మంది భక్తులైనా ఆలయానికి వచ్చే వారు కాదు. దాతలు, ప్రజాప్రతినిధులు, భక్తులు అందించిన విరాళాలతో ఆలయ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు శివరాత్రికి లక్షలాది మంది వస్తున్నారు. మున్ముందు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.
– సాధు వీరప్రతాపరెడ్డి, దాత