ఖమ్మం అర్బన్, మార్చి 12 : పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా మనోవికాస నిపుణులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధం చేశారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షల కోసం విద్యార్థులు కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 17,293 మంది విద్యార్థుల కోసం 98 కేంద్రాలను ఏర్పాటుచేశారు.
సిట్టింగ్ స్కాడ్ 98 మంది, ఫ్లయింగ్ స్కాడ్ ఆరుగురితో కూడిన బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నారు. 1,658 మందికి పైగా ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించనున్నారు. జిల్లాలోని ఏ పాఠశాల విద్యార్థులకైనా హాల్ టికెట్లు అందని పక్షంలో నేరుగా విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు విద్యాశాఖ అధికారులు కల్పించారు. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులుంటే హెల్ప్లైన్ నెంబర్ 8331851510లో ఫిర్యాదు చేసేలా కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ నెంబర్కు వచ్చే ఫోన్ల సమాచారాన్ని నమోదు చేసుకోవడంతోపాటు డీఈవో, ఏసీల దృష్టికి సిబ్బంది తీసుకెళ్లనున్నారు.
పరీక్ష కేంద్రంలోకి ఇన్విజిలేటర్లు మొబైల్ తెచ్చేందుకు అనుమతి లేదు. ఇన్విజిలేటర్తోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులతో సహా మొబైల్ ఫోన్లు వాడొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీఎస్, డీవోల సమావేశంలో సూచించడంతోపాటు గురువారం జూమ్ మీటింగ్లో ఎంఈవోలకు డీఈవో చైతన్య జైని నిబంధనల గురించి మరోసారి వివరించారు.
విద్యాశాఖ ఎన్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ నాంపల్లి రాజేశ్ పదో తరగతి పరీక్షలకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అబ్జర్వర్గా విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షల నిర్వహణ, కేంద్రాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బందికి పలు సూచనలు చేస్తూ సక్రమంగా పూర్తయ్యేలా చూడనున్నారు. ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా రెండు జిల్లాల అధికారుల నుంచి పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన వివరాలు సేకరించారు.