మామిళ్లగూడెం, మే 25 : బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా అధికారులు అదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగానే పాపటపల్లి – మిర్యాలగూడ నూతన రైలుమార్గాన్ని నిర్మించాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఖమ్మంలోని ఐడీవోసీలో గురువారం జరిగిన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాలగూడెం నూతన రైలుమార్గం అలైన్మెంట్ వల్ల ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని 12 గ్రామాల ప్రజలు, చిన్న సన్నకారు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని అన్నారు. దీంతో తాను కేంద్ర రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్లను కలిసి చేసిన విజ్ఞప్తుల ఫలితంగా అలైన్మెంట్ మార్పునకు వారు అంగీకరించారని అన్నారు. మళ్లీ సర్వే చేసి ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేని విధంగా కొత్త రైలుమార్గాన్ని నిర్మించాలని కోరారు. రైల్వేలో ప్రొటోకాల్ పాటించడం లేదని, ఏ సమాచారమూ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏయే ప్రాజెక్టులు ఏయే దశల్లో ఉన్నాయో, అవి ఎప్పటికి పూర్తవుతాయో అనే వివరాలను సమర్పించాలని సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని, వారు అడిగే సమస్యలపై స్పందించాలని అన్నారు. జిల్లాలో కొత్త రహదారుల కోసం రూ.755 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఖమ్మం- కురవి రహదారి అభివృద్ధికి రూ.124.80 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. త్వరలో ఖమ్మంలో సీఐఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కేంద్రం సహకరించకపోయినా, నిధులు ఇవ్వకపోయినా సీఎం కేసీఆర్ తెలంగాణను బంగారుమయంగా తీర్చిదిద్దారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణను పరుగులు పెట్టిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రాష్ట్ర పారిశ్రామికంగా పురోగతి సాధించడం వెనుక సీఎం కేసీఆర్ దూరదృష్టి, యువనేత కేటీఆర్ కృషి ఎంతగానో ఉన్నాయని అన్నారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనువైన వాతావరణం కల్పించడం వల్లే తెలంగాణలో కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. వైద్యారోగ్య రంగంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉందని అన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నెలకొల్పిన సీఎం కేసీఆర్.. ఆరోగ్య తెలంగాణకు అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. గోల్డ్ రిఫైనరీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.
జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ.. మధిర నియోజకవ ర్గంలో రైల్వేలైన్ ఎకువగా ఉన్నదని, మధిర పట్టణం, పాతర్లపాడు, రాంపురం క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్యూబీ) నిర్మించాలని కోరారు.
వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. కొణిజర్ల మండలం బ్రౌన్స్ కళాశాల నుంచి తనికెళ్ల స్టేజీ, పల్లిపాడు రహదారులు అభివృద్ధి పర్చాలని కోరారు. బ్రౌన్స్ కాలేజీ నుంచి పల్లిపాడు వరకు సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటుచేయాలని కోరారు.
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. నాయుడుపేట చౌరస్తా నుంచి రాపర్తినగర్ వరకు, పొన్నెకల్ నుంచి మద్దులపల్లి వరకు రోడ్డు విస్తరించాలని కోరారు. మండల హెడ్ క్వార్టర్స్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రైల్వేలైన్ ఏర్పాటులో రైతుల భూములు ప్రభావితం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ ఎన్.వెంకటేశ్వరరావు, దిశ కమిటీ సభ్యుడు శేషుకుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.