మామిళ్లగూడెం, డిసెంబర్ 30: అత్యాధునిక సాంకేతికతతో జిల్లాలో నేరాలను కట్టడి చేస్తున్నామని సీపీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. గడిచిన ఏడాదిలో కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న నేరాలు, విచారణ, కన్విక్షన్పై శుక్రవారం ఖమ్మం నగరంలోని పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మహిళలపై వేధింపు కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. నేరాలకు పాల్పడిని ఏడాదిలో తొమ్మిది మందికి జీవిత ఖైదు పడిందన్నారు. పోలీస్ అధికారులు ఛార్జిషీట్ బలంగా వేస్తున్నారన్నారు.
కోర్ట్ లైజనింగ్ అధికారులు, పీపీలు తమ విధులను నిజాయతీగా నిర్వహిస్తున్నారన్నారు. హైదరాబాద్ స్థాయిలో ఖమ్మంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. బాధితులు పోగొట్టుకున్న ప్రాపర్టీని ఎక్కువశాతం రికవరీ చేశామన్నారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న 13 మందిపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తున్నామన్నారు. చోరీలు అరికట్టేందుకు మొత్తం 35 బీట్స్లో నిఘా పెంచామన్నారు. ఖమ్మంలో ట్రాఫిక్ తీవ్రత అరికట్టేందుకు రెండో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. షీటీమ్స్ పనితీరు కారణంగా మహిళలపై వేధింపులు తగ్గాయన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు రెహమాన్, ఆంజనేయులు, వెంకటస్వామి, బస్వారెడ్డి, ప్రసన్నకుమార్, సీఐలు సర్వయ్య, గోపి పాల్గొన్నారు.