అన్నపురెడ్డిపల్లి, జనవరి 19 : జంతువుల పరిరక్షణ, అడవుల సంరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ అన్నారు. శుక్రవారం రామవరం రేంజ్ పరిధిలోని అబ్బుగూడెం, మర్రిగూడెం బీట్లలో ప్లాంటేషన్లను భద్రాద్రి జోన్ సీసీఎఫ్ భీమానాయక్, డీఎఫ్వో కిష్టాగౌడ్లతో కలిసి ఆమె పరిశీలించారు. ప్లాంటేషన్లోని మొక్కల పెంపకం, చెక్డ్యాంలలో నీటి నిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల్లో వివిధ జాతులకు చెందిన మొక్కలను విరివిగా పెంచాలన్నారు. నాటిన మొక్కలను కాపాడేందుకు నీటిని అందించాలన్నారు.
అటవీ జంతువుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, వేసవి కాలంలో జంతువులు, పక్షి జాతులకు నీటి వసతి కల్పించాలన్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎఫ్డీవో కోటేశ్వరరావు, ఎఫ్ఆర్వో ఉమ, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.