ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరంలో ఇటీవల వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన ఐదేళ్ల పాపపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ పాప కంటి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం వచ్చింది. ఇంటి దీపమైన పాప కంటిచూపు పోతుందని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఏదేమైనప్పటికీ ప్రజలకు వీధి కుక్కల బెడదను తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది.
పట్టణాలు, నగరాల్లోని వీధి కుక్కలకు సంతానం కలుగకుండా టీకాలు వేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్తో పాటు సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని 60 డివిజన్లలో శానిటరీ ఇన్స్పెక్టర్లు కుక్కలను లెక్కించే పనిలో పడ్డారు. కార్పొరేషన్లో మొత్తం 5,400 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. బుధవారం నాటికి 3,890 కుక్కలకు టీకాలు వేశారు. మున్సిపల్ కమిషనర్లు రంగంలోకి దిగి టీకాలు వేసే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో..
కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నారు. గతంలో కుక్కలకు శస్త్రచికిత్స జరిగి ఉన్నా, అప్పటికే టీకా వేసి ఉన్నా ఉంటే వాటిని వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఒక్క యాంటీ రేబిస్ టీకాకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వెచ్చిస్తున్నది. ఖర్చు ఎక్కువతున్నప్పటికీ సర్కార్ ప్రజాసంక్షేమం కోసం టీకాలు కొంటున్నది. ఖమ్మం నగరంలో కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు టీకాలు వేసే ప్రక్రియను వేగవంతం చేశారు.
పందులు పెంచేవారికి నోటీసులు..
పందులు వీధుల్లో తిరగుతుండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, నగర మేయర్ పునుకొల్లు నీరజ సమస్యను సీరియస్గా తీసుకునానరు. కార్పొరేషన్ పరిధిలో పందులు పెంచుతున్న వారికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నగరంలోని 7, 59వ డివిజన్లలో పందుల పెంపకం ఎక్కువగా ఉందని గుర్తించి గుర్తించి యజమానులతో మాట్లాడారు. పందులు వీధుల్లో తిరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పెంపకం కోసం దానవాయిగూడెంలోని ఓ ప్రభుత్వ స్థలాన్ని కేటాయించామని, ఆ పరధి దాటి పందులు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లాలో కలెక్టర్ అనుదీప్ నేతృత్వంలో డీపీవో, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు కుక్కలకు కు.ని టీకాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం నుంచి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 6 వేల కుక్కలు ఉండగా కేవలం కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ పట్టణాల్లోనే 4,500 కుక్కలు ఉన్నట్లు అధికారులు లెక్కించారు. వాటన్నింటికీ కు.ని టీకాలు వేయనున్నారు. దీంతో పాటు యాంటీ రేబిస్ టీకాలూ వేయనున్నారు. ప్రత్యేక బృందాలు రోజుకు వంద కుక్కలకు చొప్పున సర్జరీలు చేయనున్నారు. సర్జరీ చేసిన కుక్కను వారం రోజులు పాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు.
నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్..
పాల్వంచ, కొత్తగూడెం పరిధిలో వీధి కుక్కలను పట్టుకునేందకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీ పరిధి గొల్లగూడెం ఏబీసీ సెంటర్లో కుక్కలకు సర్జరీలు చేస్తాము. ఇంట్లో కుక్కలను పెంచుకునేవారూ జీవాలకు ముందస్తుగానే టీకాలు వేయించాలి.
– రఘు, మున్సిపల్ కమిషనర్ కొత్తగూడెం
ప్రజలకు ఇబ్బందులు రానివ్వం..
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. కుక్కలకు సంతానోత్పత్తికి కలగకుండా టీకాలు వేయిస్తున్నాం. మూడు బృందాలు డివిజన్లలో పర్యటిస్తున్నాయి. పందులు పెంచేవారికీ నోటీసులు ఇస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– పునుకొల్లు నీరజ, ఖమ్మం కార్పొరేషన్, మేయర్
నగర పరిధిలోలో టోల్ ఫ్రీ నెంబర్..
ఖమ్మం నగరంలో వీధి కుక్కలు, పందుల బెడద ఎదుర్కొంటున్న వారి కోసం నగరపాలక సంస్థ టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ప్రజలు నంబర్కు 79012 98265కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.