ఇల్లెందు రూరల్, డిసెంబర్ 29 : సుదిమల్ల గిరిజన గురుకుల బాలికల కళాశాలలో నిర్వహిస్తున్న తెలంగాణ ఏడవ రాష్ట్రస్థాయి గిరిజన గురుకుల బాలికల క్రీడా పోటీలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. జోన్లవారీగా నిర్వహిస్తున్న పోటీల్లో క్రీడాకారిణులు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ టి.వెంకటేశ్వరరాజు, ప్రిన్సిపాల్ అరుణకుమారి, క్రీడా కోఆర్డినేటర్ జి.మాధవి క్రీడా పోటీల వివరాలను వెల్లడించారు. అండర్-19 జోన్-3 ఖోఖో విభాగం ఫైనల్స్లో అంకంపాలెం బాలికల కళాశాల ప్రథమ, జోన్-3 సెలక్షన్ టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. అండర్-19 కబడ్డీ విభాగంలో జోన్-1, 2 జట్లు తలపడగా.. జోన్-2 జట్టు విజయం సాధించింది. అండర్-17 బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో జోన్-4 చెందిన విన్నర్, రన్నర్ జట్లు ఫైనల్స్కు చేరాయి. అండర్-14 హ్యాండ్బాల్ విభాగంలో జోన్-1, 2 జట్లు తలపడగా.. జోన్-1 విజేతగా నిలిచింది. అండర్-19 అథ్లెటిక్స్ విభాగంలో జోన్-3కి చెందిన టి.శ్రీతేజ 100 మీటర్లు, 400 మీటర్లు, షాట్పుట్ విభాగంలో పద్మ ప్రథమ బహుమతి సాధించింది. అండర్-17 విభాగంలో జోన్-3 క్రీడాకారిణి పి.ఇందు 100 మీటర్లు, డిస్కస్ త్రోలో ప్రథమ, 400 మీటర్ల విభాగంలో ద్వితీయ బహుమతి సాధించింది. అండర్-14 విభాగంలో జోన్-3 క్రీడాకారిణి జే.సాత్విక 100 మీటర్లు షాట్పుట్, డిస్కస్త్రోలో ప్రథమ, 400 మీటర్ల విభాగంలో ద్వితీయ బహుమతి సాధించింది. కాగా.. ముఖ్యఅతిథిగా హాజరైన గురుకుల స్పోర్ట్స్ అధికారి రవికుమార్ క్రీడాకారిణులు కనబరుస్తున్న ప్రతిభను పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలు, కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు, గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ షాజహాన్, వైస్ ప్రిన్సిపాల్ కవిత, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.