పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ సూత్రధారులెవరో తేలిపోయింది. బీజేపీ బండారం బట్టబయలైంది.. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా దొరికిపోయి బుకాయిస్తున్న దొంగల‘బండి’ జైలు పాలయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలువురు విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టడంలో ప్రభుత్వం సక్సెస్ కావడంతోపాటు లీకేజీ ప్రభావం ఇతర పరీక్షలపై పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టడాన్ని అభినందిస్తున్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసి వారికి భరోసానిచ్చిందని పేర్కొంటున్నారు. కాగా, కొందరు ప్రశ్నాపత్రాలను లీకేజీ చేస్తూ తమను బలి పశువులుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా పరీక్షలు నిర్వహిస్తున్నా.. కొన్ని శక్తులు సర్కార్పై బురద చల్లేందుకు యత్నిస్తున్నాయని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నాయి.
ఖమ్మం, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విద్యార్థులను కలవరపరిచింది.. వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్లు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలను చూసి యావత్ సమాజం ఉలికిపాటుకు గురైంది.. కానీ.. లీకేజీ వ్యవహారమంతా రాజకీయ లబ్ధి కోసం కొందరు చేసిన కుట్రలని నిరూపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని గంటల సమయం పట్టలేదు. లీకేజీతో ప్రమేయం ఉన్న ఉపాధ్యాయులను అప్పటికప్పుడు సస్పెండ్ చేసింది.
పరీక్ష జరుగుతున్న సమయంలో పేపర్ను అవుట్ చేయించి లీకేజీగా కట్టుకథలు సృష్టించాలనుకున్న వారి ఆటకట్టించింది.. పోలీస్ బలగాలను రంగంలోకి దించి లీకేజీ సూత్రధారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేయించింది.. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరో ఐదుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒకవైపు కుట్రదారుల నీచ రాజకీయాలను పటాపంచలు చేస్తూనే రాష్ట్ర సర్కార్ మరోవైపు పదోతరగతి పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తున్నది.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ‘పది’ంతల భరోసానిచ్చింది. ఈ పరిణామాలపై కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ‘నమస్తే’తో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల జీవితాలను బలిచేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా పరీక్షలు రద్దవుతాయని, మళ్లీ పరీక్షలు రాయాల్సి వస్తుందని ఆందోళన చెందామని విద్యార్థులు వెల్లడించారు. తిరిగి పరీక్షలు యథావిధిగా కొనసాగుతుండడం ఆనందాన్నిచ్చిందంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రదారులు ఉపాధ్యాయుల జీవితాలను బలిచేస్తున్నారని, ప్రభుత్వం పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నా, సర్కార్పై బురద చల్లేందుకు యత్నిస్తున్నాయని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యథావిధిగా పరీక్షల నిర్వహణ సంతోషకరం..
నాకు ఇద్దరు కవలలు. ఇద్దరూ పదోతరగతి చదివారు. వీరిలో ఒక కుమారుడు బాగా చదువుతాడు. మరో కుమారుడు సరాసరి మార్కులు తెచ్చుకుంటాడు. ఇప్పుడు వార్షిక పరీక్షలు రాస్తున్నారు. పబ్లిక్ పరీక్షలంటేనే పిల్లలు కొంత భయపడతారు. కష్టపడి చదువుతారు. పరీక్షలు మొదలైన రోజే పేపర్ లీక్ వార్తలు బయటకు రావడంతో పిల్లలు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తుందా.. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తుందా.. అన్న సందేహాలు విద్యార్థులను ఎంతో ఒత్తిడికి గురిచేశాయి. మా కుమారుల విషయంలోనూ నాకు ఆందోళన కలిగింది. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ఒక కుమారుడు రాయగలడు గానీ, మరో కుమారుడు రాయగలడా.. అన్న ప్రశ్న తలెత్తింది. రాజకీయ లబ్ధి కోసం కొందరు పేపర్ లీక్కు పాల్పడుతున్నారు. ఎవరో చేసి తప్పునకు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులను ప్రభుత్వం తక్షణం అరెస్ట్ చేయించింది. కోర్టు వారికి రిమాండ్ విధించింది. పరీక్షలను తిరిగి సజావుగా నిర్వహిస్తున్నది. అందుకు సంతోషం.
– వడిత్యా వెంకట్రాం, విద్యార్థుల తండ్రి, లోక్యాతండా, కూసుమంచి మండలం
పదోతరగతి ప్రశ్నాపత్రాన్ని అవుట్ చేయించి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం సత్తుపల్లిలో పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘ఏడాదంతా కష్టపడి చదివించాం.. తీరా పరీక్షలు రాసే సమయానికి పేపర్ లీకేజీ అంటూ వచ్చిన వార్తలను చూసి ఆందోళనపడ్డాం.. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయొద్దు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తే పిల్లలు మానసికంగా కుంగిపోతారన్నారు. రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలను బలిపెట్టొద్దన్నారు. అనంతరం సత్తుపల్లి పోలీస్స్టేషన్లో పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ కరుణాకర్కు ఫిర్యాదు చేశారు. నిరసనలో కంభంపాటి చెన్నారావు, షేక్ ఇమామ్, షేక్ పాషామియా, షేక్ మదీనాపాషా, ఇజ్జగాని చెన్నారావు, వెంకటేశ్వరరావు, పుష్ప పాల్గొన్నారు.
టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్రసర్కార్
పావులుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు..
పదోతరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. పేపర్ లీకేజీ విషయంలో కొందరు స్వార్థపూరిత నాయకులు పావులుగా విద్యార్థులు, ఉపాధ్యాయులను వాడుకుంటున్నారు. విద్యార్థులెవరూ ఆందోళనకు గురికావొద్దు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. పరీక్షల నిర్వహణను సర్కార్ సీరియస్గా తీసుకున్నది. పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులకు శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– మోత్కూరి మధు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, ఖమ్మం
నిందితులకు చట్టమే బుద్ధి చెప్తుంది..
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విద్యార్థులను ఆందోళనకు గురిచేసంది. పిల్లలు ఒత్తిడికి గురైన విషయం వాస్తవం. బయట ఏం జరుగుతుందో తెలియక రెండు రోజులు సతమతమయ్యారు. పబ్లిక్ పరీక్షల కోసం విద్యార్థులు ఏడాదంతా ప్రిపేరయ్యారు. వారి మానసిక స్థాయిని, వారు అనుభవిస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకున్న వారెవరూ పేపర్ లీకేజీ వంటి నీచానికి పాల్పడరు. చదువును కూడా రాజకీయం చేయాలనుకునే వారికి చట్టమే బుద్ధి చెప్తుంది.
– దిరిశాల శ్రీనివాసరావు, విద్యార్థి తండ్రి, బూడిదంపాడు, రఘునాథపాలెం మండలం
పరీక్షలు ప్రశాంతంగా రాస్తున్నా..
పది పబ్లిక్ పరీక్షలు రాసేందుకు ఏడాదంతా కష్టపడ్డాను. ప్రశ్నాపత్రాల లీకేజీ విషయం తెలిసి నేను ఆందోళన చెందాను. విన్నవెంటనే నిరాశ కలిగింది. పరీక్షలు క్యాన్సిల్ అవుతాయేమోనని భయపడ్డాను. కానీ యథావిధింగా పరీక్షలు కొనసాగుతుండడంతో తిరిగి ఊపిరివచ్చింది. ఇక ఏమీ పట్టించుకోకుండా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నా.
– లోకేశ్, పదో తరగతి విద్యార్థి, ఖమ్మం
నిందితులకు శిక్ష పడాలి..
నేను ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేశాను. పిల్లల చదువుకోసం ఉద్యోగం మానేశాను. దగ్గరుండి పిల్లలను చదివిస్తున్నాను. మాపాప ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాస్తున్నది. పేపర్ లీకేజీ వ్యవహారం తెలిసి ఎంతో కలత చెందింది. తిరిగి పరీక్షలు సజావుగా కొనసాగుతుండడంతో తిరిగి ఊపిరి పీల్చుకున్నది. విద్యార్థుల జీవితాల చెలగాటమాడుతున్న నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
– జమ్ముల శ్వేత, విద్యార్థిని తల్లి, ఖమ్మం
పిల్లల కష్టం వృథా అవుతుందని భయపడ్డాం..
మా కుమారుడు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. తెలుగు, హిందీ పేపర్ల లీకేజీపై టీవీల్లో వార్తలు చూసి గందరగోళానికి గురయ్యాడు. పిల్లలు తెల్లవారుజామున నిద్రలేచి బడికి వెళ్లి రాత్రి 8 గంటలకు ప్రత్యేక తరగతులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేవారు. లీకేజీ కారణంగా పరీక్షలు రద్దయి పిల్లల కష్టం వృథా అవుతుందేమోనని నాలాంటి ఎంతోమంది తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పేపర్ లీకేజీతో ప్రమేయం ఉన్న ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయడం, రాజకీయ లబ్ధి కోసం లీకేజీకి పాల్పడిన వారిని రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడంతో మాకు ఊరటకలిగింది. పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తుండడం ఆనందాన్నిచ్చింది. రెండోసారి పరీక్షలు రాయడం ఎంతోమంది విద్యార్థులకు కష్టతరం.పరీక్షలు సజావుగా జరుగుతుండడం సంతోషకరం.
– తేళ్ల ప్రవీణ్, విద్యార్థి తండ్రి, ఇల్లెందు
స్వార్థపూరిత శక్తుల కారణంగానే..
పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడడం క్షమించరాని నేరం. నిందితులకు కఠిన శిక్షలు పడాలి. లీకేజీ వ్యవహారంలో కొంతమంది ఉపాధ్యాయుల ప్రమేయం ఉండడం బాధాకరం. కొంతమంది స్వార్థపూరిత శక్తుల కారణంగానే ఇలాంటి గందరగోళం ఏర్పడింది. లీకేజీకి పాల్పడిన వారు ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రశ్నాపత్రాల లీకేజీ హేయమైన చర్య. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం..? పదోతరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయడానికి ఆరు నెలల ముందు నుంచే కష్టపడతారు. తిండి నిద్ర మానుకుని చదువుతారు. ఒకవేళ పరీక్షలు రద్దు అయితే మళ్లీ వారిలో చదివే ఆసక్తి వస్తుందా..? యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఆశించిన ఫలితాలను రాబట్టగలవా..? ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి.
– గుగులోతు రామకృష్ణ, యూటీఎఫ్ మండల కార్యదర్శి, బోనకల్లు
పరీక్షల నిర్వహణ సంతోషకరం..
పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు ఏడాదంతా కష్టపడి చదివాను. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరయ్యాను. మాకోసం ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారు. తల్లిదండ్రులు అండగా నిలిచి నన్ను పరీక్షలకు సిద్ధం చేయించారు. పరీక్షలు మొదలైన మొదటిరోజు, రెండో రోజు పేపర్ లీక్ అయ్యాయని వార్తలు విని కంగారు పడ్డాను. పరీక్షలు రద్దయితే మళ్లీ పరీక్షలు రాయాలా.. అని ఆందోళనకు గురయ్యాను.. కానీ పరీక్షలు యథావిధిగా కొనసాగుతుండడం సంతోషాన్నిచ్చింది.
-ఉండ్రు ప్రేమజ్యోతి, పదోతరగతి విద్యార్థిని, కొత్తగూడెం
ప్రశ్నాపత్రాల లీకేజీ నీచమైన చర్య..
మా ఇద్దరు పిల్లలు పదోతరగతి పరీక్షలు రాస్తున్నారు. పబ్లిక్ పరీక్షలు రాయడానికి కష్టపడి చదువుతున్నారు. పరీక్షలు పూర్తి కాగానే వాళ్లు కాలేజీకి వెళ్తారు, భవిష్యత్తులో మంచి కొలువులు సాధిస్తారని తల్లిదండ్రులు కలలు కంటారు. పేపర్ లీకేజీ వ్యవహారం ఒక్కసారిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల ప్రశ్నాపత్రాలు లీక్ చేయించడం నీచమైన విషయం. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి పేపర్ లీకేజీకి పాల్పడడం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రశ్నాపత్రం లీకేజీతో ప్రమేయం ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయించడం మాకు ఊరటనిచ్చింది. పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తుండడంతో విద్యార్థులూ ఆనందపడుతున్నారు. లీకేజీ వ్యవహారంలో ఉపాధ్యాయుల ప్రమేయం ఉండడం బాధాకరమైన విషయం.
– కొమ్మినేని పిచ్చయ్య, విద్యార్థినుల తండ్రి, రావినూతల, బోనకల్లు మండలం
పకడ్బందీగా పరీక్షలు..
పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. మరోసారి లీకేజీలకు ఆస్కారం లేకుండా నిందితులను అరెస్ట్ చేయించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా పరీక్షలను సజావుగా కొనసాగిస్తున్నది. ప్రశ్నాపత్రాలను లీక్ చేయించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యాన్ని ఇచ్చింది. జరిగిన పరిణామాల రీత్యా పరీక్షా కేంద్రాల్లో పోలీస్ నిఘా పెంచడం, రెవెన్యూ అధికారులతో తనిఖీలు చేయించడం హర్షణీయం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసే వాతావరణం సృష్టించడం అభినందనీయం.
– దొడ్డా వరప్రసాద్, ఉపాధ్యాయుడు, తాటిపూడి, వైరా మండలం, ఖమ్మం జిల్లా
విద్యావ్యవస్థను కాపాడాలి..
పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. తల్లిదండ్రులను ఎంతో ఆందోళన చెందారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం చేసిన పని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం క్షమించరాని నేరం. ఏ నాయకుడైనా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ఒత్తిడిని అధిగమించే విధానాలను వివరించాలి. అలా ఏమీ చేయకుండా రాజకీయ ఎత్తుగడల్లోకి విద్యార్థులను లాగడం ఎంతవరకు సమంజసం..? లీకేజీ సూత్రధారులకు కోర్టు తగిన శిక్షలు విధించాలి. విద్యావ్యవస్థను కాపాడాలి.
– తోటమళ్ల రమ, ప్రధానోపాధ్యాయురాలు, జడ్పీ హైస్కూల్, సారపాక
నిందితులకు కఠిన శిక్ష తప్పదు..
మా కుమారుడు షేక్ నసీర్ సత్తుపల్లి కేకేఆర్ గౌతమ్ స్కూల్లో పదోతరగతి చదివాడు. ఏడాదంతా కష్టపడి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. పేద, మధ్యతరగతి కుటుంబాలు పిల్లలను అష్టకష్టాలు పడి చదివిస్తాయి. వారిని తల్లిదండ్రులు ప్రయోజకులను చేద్దామనుకుంటారు. కానీ కొందరు స్వార్థపరులు రాజకీయాల లబ్ధి కోసం పేపర్ లీకేజీ చేయించడం, పిల్లల జీవితాలతో చెలగాటమాడడం దుర్మార్గం. ఒకవేళ ప్రభుత్వం పరీక్షలు రద్దుచేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది..? మొదటి సారి పరీక్ష రాసిన ఉత్సాహం విద్యార్థుల్లో రెండోసారి ఉండదు. పిల్లలు ఆందోళనకు గురవుతుంటే అది చూసి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడేవారిని చట్టం కచ్చితంగా శిక్షిస్తుంది.
– షేక్ మదీనాపాషా, విద్యార్థి తండ్రి, సత్తుపల్లి
పేపర్ లీక్ చేయించిన నాయకులకువిద్యార్థుల బాధ పట్టదా..?
మా పాప కావ్య కిష్టారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివింది. పరీక్షలు బాగా రాయాలని ఎంతో కష్టపడింది. పేపర్ లీకేజీ వార్తలు విని ఎంతో ఆందోళనపడింది. పాపను చూసి మేమూ బాధపడ్డాం. స్వార్థం కోసం రాజకీయ నాయకులు పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారు. ఒకవేళ పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వస్తే విద్యార్థులు ఇంతే ఆసక్తిగా రెండోసారి రాస్తారా..? విద్యార్థుల బాధ లేకేజీ నాయకులకు పట్టదా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే చట్టాలు ఊరుకుంటాయా.. చట్టం కచ్చితంగా శిక్షిస్తుంది. మరోసారి ఎవరు పేపర్ లీకేజీ చేయాలనుకునా వారిలో వణుకుపుట్టేలా శిక్ష ఉంటే బాగుంటుంది.
– అల్లు సతీశ్రెడ్డి, విద్యార్థిని తండ్రి, చెరుకుపల్లి, సత్తుపల్లి మండలం
పేపర్ లీక్ కాదు.. పేపర్ అవుట్..
పరీక్ష సమయానికి ముందే ప్రశ్నాపత్రంబయటకు వస్తే అది పేపర్ లీక్. పరీక్ష జరుగుతున్నప్పుడు ప్రశ్నాపత్రం బయటకు వస్తే అది పేపర్ అవుట్. ఇన్విజిలేటర్ కారణంగా పదోతరగతి తెలుగు పేపర్ అవుట్ అయింది. అందుకు సంబంధించి సదరు ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. హిందీ పేపర్ భద్రతా పరమైన వైఫల్యం కారణంగా అవుట్ అయింది. పేపర్ అవుట్ చేయించి పేపర్ లీకేజీగా చిత్రీకరించేందుకు నాయకులు యత్నించడం పైశాచికం. 4.50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే కుట్రే ఇది. వారి తల్లిదండ్రుల ఆశలు, కలలను ఛిద్రం చేసే పని ఇది. నిందితులను విచారించి చట్టం సరైన శిక్ష విధించాలి. మరోసారి పేపర్ లీకేజీ, అవుట్కు ఆస్కారం లేకుండా చూడాలి.
– చిత్తలూరి ప్రసాద్, పీఆర్టీయూ నేత, సత్తుపల్లి
ప్రభుత్వం స్పందించిన తీరు భేష్..
పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రాత్రికి రాత్రే నిందితులను అరెస్ట్ చేయించింది. తెలుగు పేపర్ లీక్ అయిందనే వార్తలు విని ఎంతో ఆందోళన చెందాను. నాలాంటి ఎంతోమంది తల్లిదం డ్రులు బాధపడ్డారు. ఈపరీక్షలు అయిపోతే తర్వాత ఎంసెట్ రాయించాలా.. ? మరేదైనా కోర్సు చదివించాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ పేపర్ లీకేజీ ఒక పెద్ద షాక్. మాపాప పూర్తయిన రెండు పరీక్షలూ బాగా రాశానని చెప్పింది. తిరిగి పరీక్షలు నిర్వహిస్తే పిల్లలు రాయగలరా.. ఇప్పుడు పాప బాగా రాశానని చెప్పింది. మరోసారి పరీక్షలు నిర్వహిస్తే పేపర్ ఇంత ఈజీగా వస్తుందని గ్యారెంటీ ఉందా. మళ్లీ అంత శ్రద్ధ తీసుకుని పాపను పరీక్షలకు సిద్ధం చేయగలమా..? ఉపాధ్యాయులు పిల్లల చదువులపై తిరిగి దృష్టి పెట్టగలరా? అనే ఆందోళన నన్ను బాధించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భరోసా నింపేందుకు కేవలం కొన్నిగంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయించింది. పరీక్షలు యథావిధిగా జరుగుతుండడం ఆనందాన్నిచ్చింది.
– పాండవుల వెంకటేశ్వర్లు, విద్యార్థి తండ్రి, భద్రాచలం
నిందితుల అరెస్ట్ ఊరటనిచ్చింది..
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వార్తలను టీవీల్లో చూసి ఒక్కసారిగా మా పాప కుంగిపోయింది. తల్లిదండ్రులుగా మేమెంతో ఆందోళన చెందాం. రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఏమిటనే కోపం వచ్చింది. లీకేజీతో ప్రమేయంతో ఉన్న నిందితులను ప్రభుత్వం కేవలం కొన్ని గంటల్లోని అదుపులోకి తీసుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది. మా పాప లాంటి ఎంతో మంది విద్యార్థులకు భరోసా లభించింది. నిందితులకు కోర్టు కచ్చితంగా కఠిన శిక్ష విధిస్తుందనే నమ్మకం ఉంది.
– దామెర్ల శ్రీనివాస్, రేగుబల్లి, దుమ్ముగూడెం మండలం
ప్రభుత్వం పకడ్బందీగాపరీక్షలు నిర్వహిస్తున్నది..
పదోతరగతి పరీక్షలను ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నది. కొం దరు స్వార్థ నాయకులు సమాజాన్ని గందరగోళం చేసేందుకు లీకేజ్ కలకలం రేపాలని చేసిన పని ఇది. లీకేజీ పేరిట రాజకీయ నాయకులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా ప్రవర్తించడం సరికాదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం పది పరీక్షల నిర్వహణకు మరింత మంది స్కాడ్లను నియమించాలి.
– జి.సురేందర్రెడ్డి, ఉపాధ్యాయుడు, ఎర్రగుంట హైస్కూల్, చండ్రుగొండ మండలం
కష్టపడి చదివా..
పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు కష్టపడి చదివా. పరీక్షలు బాగా రాయాలనుకున్నా. నిద్రాహారాలను మానేసి ప్రిపేర్ అయ్యాను. ప్రత్యేక తరగతులకు హాజరయ్యాను. ఉపాధ్యాయులు వందశాతం ఫలితాలు సాధించేందుకు ఎంతో పనిచేశారు. పేపర్ లీక్ అయిందని వార్తలు విని బాధపడ్డాను. ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసింది. కానీ పరీక్షలు యథావిధిగా కొనసాగుతుండడంతో తిరిగి ఊపిరి వచ్చింది. ఇప్పుడు ఉత్సాహంగా పరీక్షలు రాస్తున్నా.
– రాయపూడి వర్షిణి, రేగుబల్లి, దుమ్ముగూడెం మండలం
కఠినంగా శిక్షించాలి
తల్లిదండ్రులు కూలి పనులకు వెళుతూ, కొన్నిసార్లు పస్తులు ఉండి మరీ పిల్లలను చదివిస్తున్నారు. పిల్లల భవిష్యత్తే మా భవిష్యత్తుగా బతుకుతున్నాం. వాళ్లు బాగా చదువుకుంటే మాకు ఆసరా అవుతారు. వాళ్ల జీవితమూ బాగుంటుందని మా అశ. పనిగట్టుకుని పేపర్ లీక్ చేయించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారికి మనసంటూ ఉండదా.. వీలైతే విద్యార్థులకు సాయం చేయాల్సింది పోయి.. నష్టం చేయడం ఏమిటి..? నిందితులపై కోర్టు కఠిన చర్యలు తీసుకోవాలి. మరోసారి ఏ నాయకుడూ విద్యార్థుల జోలికి రాకుండా చూడాలి.
– మక్కల అంజమ్మ, విద్యార్ది తల్లి, బాలికుంట, చండ్రుగొండ మండలం
ఆందోళనకు గురయ్యాం..
టెన్త్ పేపర్ లీక్ వార్తలు చూసి ఎంతో ఆందోళనకు గురయ్యాం. స్వార్థ రాజకీయాల కోసం కొందరు ఇలాంటి నీచమైన కుట్రలకు తెరతీయడం దారుణమైన విషయం. ఒకవేళ పరీక్షలు రద్దయితే పిల్లలు మళ్లీ మొదటి నుంచి చదివే అవకాశం ఉంటుందా.. విద్యాసంస్థలు పిల్లలపై శ్రద్ధ తీసుకుంటాయా.. ఏడాదంతా చదివిన చదువంతా బూడిదలో పోసిన పన్నీరేనా.. పరీక్షలు సజావుగా జరుగుతాయా.. లేదా ఇంకేమైనా అడ్డంకులు ఎదురవుతాయా.. అనే ప్రశ్నలు తల్లిదండ్రులకు ఎదురయ్యాయి. లీకేజీ బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేయడంతో తల్లిదండ్రులు, పిల్లలకు మళ్లీ ఊపిరి వచ్చింది.
– శివసాయి ప్రసాద్, విద్యార్థి తండ్రి,అశ్వారావుపేట
విద్యార్థులకు ధైర్యం చెప్పాం..
మా స్కూల్ నుంచి పదోతరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిందని తెలుసుకుని పాఠశాలకు వచ్చి ఎంతో బాధపడ్డారు. మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుందని కన్నీరు పెట్టుకున్నారు. పరీక్షలు రద్దు కావని, జరుగుతున్న పరిణామాలను వివరించి వారికి ధైర్యం చెప్పాం. అనుకున్నట్లే పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి వస్తున్నారు. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.
– కె.శేషమ్మ, హెచ్ఎం, ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల, అనంతారం, అశ్వారావుపేట మండలం