భద్రాచలం, సెప్టెంబర్ 29: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వచ్చే నెల 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామ్లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర సైతం నిర్వహించనున్నారు. ఈ మేరకు అశ్వయుజ మాసంలో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించిన నివేదికను ఈవో రమాదేవికి వైదిక బృంద సభ్యులు అందజేశారు. ఈ వివరాలను దేవస్థాన అధికారులు ఆదివారం పత్రికలకు విడుదల చేశారు.
రోజుకో అలంకారంలో అమ్మవారి దర్శనం..
శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు రోజుకో అలంకారంలో శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 4వ తేదీన ఆదిలక్ష్మి, 5న సంతానలక్ష్మి, 6న గజలక్ష్మి, 7న ధనలక్ష్మి, 8న ధాన్యలక్ష్మి, 9న విజయలక్ష్మి, 10న ఐశ్వర్యలక్ష్మి, 11న వీరలక్ష్మి, 12న మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు. 4 నుంచి 12వ తేదీ వరకు తిరువీధి సేవలు, సంక్షేప రామాయణహవనం నిర్వహిస్తారు. 17న శబరిస్మృతి యాత్ర, వాల్మీకి జయంతి, 28న లక్ష కుంకుమార్చన, 31న సుదర్శన హోమం కార్యక్రమాలు ఉంటాయి.