Bhadrachalam | భద్రాచలం, అక్టోబర్ 13: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ఈ నెల 15 నుంచి శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. తొలిరోజు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కలిగించనున్నారు.16న సంతానలక్ష్మి, 17న గజలక్ష్మి, 18న ధనలక్ష్మి , 19న ధాన్యలక్ష్మి, 20న విజయలక్ష్మి, 21న ఐశ్వర్యలక్ష్మి, 22న వీరలక్ష్మి, 23న మహాలక్ష్మి, 24 (విజయదశమి)న నిజరూపలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తారు.
ఇదేరోజున ఆలయ అర్చకులు సంక్షేప రామాయణ హవన పూర్ణాహుతి, మహా పట్టాభిషేకం, విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామ లీలా మహోత్సవం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు శ్రీమద్రామాయణ పారాయణం పఠించనున్నారు. దశమి రోజున పట్టాభిషేకం, సంక్షేప రామాయణ హవనం చేయించుకునేందుకు ఆలయ అధికారులు భక్తులకు అవకాశం ఇచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ 3:30 నుంచి 4:30 గంటల వరకు జరిగే కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొనవచ్చు. ఏర్పాట్లను ఏఈవోలు శ్రావణ్కుమార్, భవాని రామకృష్ణ, ఈఈ రవీందర్ రాజు పర్యవేక్షించనున్నారు. దేవస్థాన ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
అక్టోబర్ 28 ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ రోజు సందర్భంగా భద్రాద్రి ఆలయ సన్నిధిలో ఆలయ అధికారులు, అర్చకులు ‘శబరి స్మృతియాత్ర’ నిర్వహించనున్నారు. ఇదే రోజు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అర్చకులు సాయంత్రమే ఆరాధన, దర్బార్ సేవ, చుట్టు సేవను పూర్తి చేసి ఆలయ కవాట బంధనం (ఆలయ తలుపులు మూయడం) చేస్తారు. 29వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కలిగిస్తారు.