భద్రాచలం, ఏప్రిల్ 27: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గత నెల 30 (శ్రీరామ నవమి రోజు)న ప్రారంభమైన శ్రీరామ పునర్వసు దీక్షలు 27 రోజులు పూర్తి చేసుకొని గురువారంతో ముగిశాయి. దీక్ష విరమణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీరామ దీక్షాపరులు తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో స్నానమాచరించి రామయ్య సన్నిధికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు బేడామండపంలో పుణ్యాహవాచన జరిపి, పుణ్యజలాలను దీక్షాపరులపై ప్రోక్షించారు. అనంతరం ఇరుముడి పూజ, పాదుకలకు అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. తరువాత దేవస్థానం ఏఈవో భవానీ రామకృష్ణ శిరస్సుపై శ్రీరామ పాదుకలను ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, కోటి రామస్వరూప్ ఉంచారు.
ఏఈవో, శ్రీరామ పునర్వసు దీక్షా పరులు భద్రగిరి ప్రదక్షిణ, నగర ప్రదక్షిణ చేసి ఆలయానికి చేరుకున్నారు. శ్రీరామ పాదుకలను గర్భాలయంలో ఉంచారు. అనంతరం భద్రుని సన్నిధిలో తిరువడిని సమర్పించి దీక్షా విరమణ చేశారు. తరువాత యాగశాల వద్ద నిర్వహించిన సంక్షేప రామాయణ హవనంలో, మహ పూర్ణాహుతిలో శ్రీరామ దీక్షితులు పాల్గొన్నారు. శ్రీరామ దీక్షాపరులకు దేవస్థానం అధికారులు అన్నదానసత్రంలో అన్నప్రసాద వితరణ చేశారు. అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
నేడు శ్రీరామ పట్టాభిషేకంపుష్యమీ నక్షత్రం సందర్భంగా శుక్రవారం శ్రీరామ దీక్షాపరులకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.