భద్రాచలం, మార్చి 25 : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరుగనున్న శ్రీరామ నవమి(రామయ్య కల్యాణం), పట్టాభిషేకం సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్లో భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచుతున్నట్లు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయదాతల కల్యాణోత్సవం టికెట్ రూ.7,500, రూ.2,500, రూ.2వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150, పట్టాభిషేకానికి రూ.1,500, రూ.500, రూ.100 చొప్పున నిర్ణయించామని, వీటిని భక్తులు ఆన్లైన్ పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భక్తులకు నేరుగా టికెట్లు విక్రయిస్తామని, ఇందుకోసం నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
స్వామివారి కల్యాణం తిలకించేందుకు రాలేని భక్తులు పరోక్షంగా తమ గోత్రనామాలతో కల్యాణం జరిపించుకోవచ్చని ఈవో తెలిపారు. ఇందుకు రూ.5 వేలు, రూ.1,116 టికెట్లను ఆన్లైన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. సెక్టార్ టికెట్లు, పరోక్ష సేవల టికెట్ల కోసం https://bhadradritemple. telangana. gov.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ ఒరిజినల్ టికెట్లను పొందడానికి ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం 11 నుంచి ఏప్రిల్ 17 ఉదయం 6 గంటల వరకు తానీషా కల్యాణ మండపంలో ఉన్న సీఆర్వో కార్యాలయంలో తమ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.