సరిగ్గా ఏడాది క్రితం భద్రాచలం పట్టణం. బస్టాండ్ ఎదురుగా ఓ టీస్టాల్ వెనుక పొదలు. స్థానికులకు గుక్క పట్టి ఏడుస్తున్న పసిబిడ్డ అలికిడి వినిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. నవజాత శిశువును పొదల్లోంచి తీసి పట్టణంలోని శిశు గృహకు అప్పగించారు. శిశు గృహ సిబ్బంది, ఆయమ్మలు బిడ్డను కంటిపాపలా చూసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పత్రాలు సమర్పించిన వారికి శిశువులను దత్తత ఇస్తున్నారు. యౌవనంలో క్షణికావేశం, పేదరికం, నిస్సహాయతనం.. ఇలా కారణం ఏదైనా కావొచ్చు.. కొందరు శిశువులను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. అనాథలుగా మారుస్తున్నారు. అలాంటి అభాగ్యులను అక్కున చేర్చుకుంటున్న శిశు గృహపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం
భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (నమస్తే తెలంగాణ): భద్రాచలం పట్ట ణంలో 2021 ఆగస్టులో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో శిశు గృహ ప్రా రంభమైంది. దారి తప్పిన చిన్నారులు, తల్లిదండ్రులు వది లేసిన శిశువులకు శిశు గృహ ఆలం బనగా మారింది. ఇప్పటివరకు 30 మంది పిల్లలకు శిశు గృహ షెల్టర్ ఇచ్చింది. పిల్లలను ఆయమ్మలే అమ్మలుగా సంరక్షిస్తున్నారు. ఇలా ఒక్కో బిడ్డకు ఆరేళ్లు వచ్చే వరకు పెంచనున్నారు. నిర్వాహ కులు పిల్లలను సంరక్షించడంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు దత్తత ఇస్తున్నారు. పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తిసే వెంటనే వారికి ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం చేయిస్తున్నారు. పిల్లల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా వారికి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఒక మేనేజర్తో పాటు ఒక ఏఎన్ఎం, ఆరుగురు ఆయాలు ప్రస్తుతం శిశు గృహలో సేవలు అందిస్తున్నారు.
కారణాలేమైనప్పటికీ కొన్ని జంటలకు ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగదు. అది వారికి జీవితంలో తీరని బాధలా మిగిలిపోతుంది. అలా అని అక్రమ పద్ధతిలో చిన్నారులను దత్తత తీసుకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అక్రమ దత్తతను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. దంపతులు తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత తీసుకుంటే అన్ని విధాలా మంచిది. పిల్లలను దత్తత తీసుకోవడానికి ఇష్టపడుతున్న దంపతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలను దత్తత ప్రక్రియను సులభతరం చేశాయి. గతంలో అమలులో ఉన్న మాన్యువల్ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తీసుకొ చ్చాయి. దత్తత విధానంపై ఐసీడీఎస్ అధికారులు, శిశు గృహ నిర్వాహకులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దత్తత కోసం దంపతులు సీఏఆర్ఏ (కారా) అనే వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మూడేళ్ల లోపు పిల్లలను దత్తత తీసుకునే అవకాశం ఉంది. దంపతులు దత్తత ప్రక్రియకు సర్కార్ నిర్దేశించిన గుర్తింపు కార్డులు సమర్పించాల్సి ఉంటుంది. శిశు సంరక్షణ కోసం నిర్దేశిత సొమ్ము డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
శిశు గృహ ప్రారంభమైన మొదట్లో కేంద్రంలో కేవలం నలుగురు పిల్లలు ఉండేవారు. కేంద్రంలో ఇప్పటివరకు 30 మంది పిల్లలకు అడ్మిషన్ దొరికింది. వీరిలో 17 మందిని సంతానం లేని దంపతులు దత్తత తీసుకున్నారు. ఏడుగురిని కన్న తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఇద్దరు పిల్లలను వేరే శిశు గృహకు బదిలీ చేశారు. ప్రస్తుతం శిశు గృహలో నలుగురు పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. కేంద్రాన్ని ఇటీవల రాష్ట్రరవాణాశాఖ మంత్రి అజయ్కుమార్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు కలెక్టర్ అనుదీప్, జిల్లా సంక్షేమ అధికారి సబిత తెలుసుకుంటున్నారు. ఐసీసీఎస్ అధికారిణి హరికుమారి పిల్లల సంరక్షణతో పాటు దత్తత ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
తల్లిదండ్రులు వదిలేసిన చిన్నారులు, శిశువులను శిశు గృహలో సంరక్షిస్తున్నాం. వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాం. కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం ఇస్తున్నాం. వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఏఎన్ఎంను నియమించాం. కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు కేంద్రం నిర్వహణ గురించి ఆరా తీస్తున్నారు. ఇటీవల మంత్రులు అజయ్కుమార్, సత్యవతి రాథోడ్ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలను దత్తత తీసుకునేవారు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. అక్రమ పద్ధతిలో దత్తత తీసుకుంటే మున్ముందు ఇబ్బందులు తప్పవు. – ఎం.సబిత, డీడబ్ల్యూవో, కొత్తగూడెం