బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో.. సింగరేణి ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ సూచనలు.., సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రణాళికలతో.. ఉత్పతి, రవాణా, రక్షణ, ఓబీ వెలికితీత, కార్మికుల సంక్షేమం, లాభాల వాటా, నియామకాలు.. ఇలా అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచింది. కోలిండియాలో లేని అనేక హక్కులు అమలు చేసుకుంటూ.. ప్రభావిత గ్రామాల్లోనూ మౌలిక వసతులు కల్పించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఏడాదికేడాది లక్ష్యాలను పెంచుకుంటూ దూసుకుపోతుండగా.., గత ఆర్థిక సంవత్సరంలో 67 మిలియన్ టన్నులుగా నమోదు చేసుకొని, రూ.2,200 కోట్ల లాభాలు ఆర్జించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎక్స్టర్నల్, ఇంటర్నల్, కారుణ్య నియామకాల ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు.., 12 వేల మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్ కల్పించడంతో సంస్థ యువశక్తితో కళకళలాడుతున్నది. మహిళా ఉద్యోగులకు అధిక ప్రాధాన్యమిస్తూనే, పీహెచ్డీలు, ప్రసూతి సెలవులు, అంబేద్కర్ జయంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకూ సెలవులు ప్రకటించింది. ఇలా సీఎం కేసీఆర్ అనేక వరాలు కురిపిస్తుండడంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
134 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించి, పదేండ్లలో సువర్ణాధ్యాయం లిఖించింది. సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంలో, సంస్థ సీఎండీ శ్రీధర్ సారధ్యంలో అద్భుతమైన వృద్ధి సాధిస్తున్నది. 2013-14లో 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సంస్థ.. ఏడాదికేడాది ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ 2022-23లో తన చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా 67 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అంటే తెలంగాణ రాక ముందు కంటే దాదాపు 33శాతం వృద్ధి సాధించింది. బొగ్గు రవాణా 2013-14లో 479 లక్షల టన్నులు చేస్తే, గత ఆర్థిక సంవత్సరం 39 శాతం వృద్ధితో 669 లక్షల టన్నులుగా నమోదు చేసింది. అలాగే 2013-14లో సింగరేణి టర్నోవర్ రూ.11,928 కోట్లు మాత్రమే ఉండగా, 2022-23లో 176 శాతం వృద్ధితో 32,978 కోట్ల టర్నోవర్కు చేరుకున్నది. లాభాలు కూడా దాదాపు 421 శాతం పెరిగాయి. అమ్మకాల్లో 176 శాతం, బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, బొగ్గు రవాణాలో 39 శాతం, ఓబీ తొలగింపులో 142 శాతం వృద్ధి చెందింది. కొత్త గనుల విస్తరణతో పాటు ఇతర రాష్ట్రాల్లో సింగరేణిని విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎండీ శ్రీధర్ ప్రత్యేక చొరవతీసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాక్ను సాధించా రు. ఇక్కడ 2023-24 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి చేయనున్నది.
ఏడాదికేడాది లాభాలు పెరగడంతో కార్మికులకు సీఎం కేసీఆర్ వాటాను పెంచుతూ వచ్చారు. తెలంగాణ రాకముందు 16 శాతం ఉన్న లాభాల వాటాను ప్రస్తుతం 32 శాతానికి పెంచి, కార్మికుల్లో సంతోషాన్ని నింపారు. గత ఆర్థిక సంవత్సరం వచ్చిన రూ.2,200 కోట్ల లాభాల నుంచి కార్మికులకు దాదాపు రూ.712 కోట్లు పంపిణీ చేశారు. దీంతో ఒక్కో కార్మికుడు లక్షలాది రూపాయలు వాటా కింద తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సింగరేణిపై ఇలా వరాలు కురిపిస్తుండడంతో కార్మికుల్లో ఆయనపై మక్కువగా పెరిగిపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసిన తొలి ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి పేరు సంపాధించింది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉద్యోగ నియామకాలు జరగని విధంగా ఎక్స్టర్నల్, ఇంటర్నల్ విధానంతో ఉద్యోగాలు కల్పించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆచరణలో సాధ్యం చేసి, చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 20 వేల కొత్త ఉద్యోగాలు కల్పించింది. 2015-2022 వరకు 58 ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు విడుదల చేసి.. 4,207మంది యువకులకు ఉద్యోగాలు కల్పించింది. ఇంటర్నల్ పరీక్షల ద్వారా 3,490 మందికి వివిధ హోదాల్లో ఉద్యోగాలు కల్పించారు. జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ 2016లో వారసత్వ ఉద్యోగాలను ప్రకటించారు. కొందరు కోర్టు ద్వారా ఉద్యోగాలను అడ్డుకున్నారు. తిరిగి ఎలాగైనా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా కారుణ్య నియామకాలు ఇస్తామని మరోసారి హామీ ఇచ్చి నిలబెట్టుకుంటున్నారు. సర్వీసుకు దగ్గరగా ఉండి అనారోగ్యంతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మెడికల్ ఇన్వ్యాలిడేషన్ చేసి, నియామకాలు చేపట్టారు. దీంతో కారుణ్య నియామకం ద్వారా 15,800 మంది కార్మికుల ప్లిలలకు ఉద్యోగాలు వచ్చాయి. వీరి రాకతో ప్రస్తుతం సింగరేణి సంస్థ యువ కార్మికులతో కళకళలాడుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 12 వేల మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్ చేశారు.
సింగరేణి సంస్థ.. బొగ్గు ఉత్పత్తి, రవాణాలోనే కాకుండా సంక్షేమంలో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో ఉంది. గతంలో కంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాలతో సంక్షేమంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టిపెట్టింది. నిబంధనల ప్రకారం అమలు చేసే వేతనాలు, అలవెన్సులతో పాటు సీఎం కేసీఆర్ ప్రకటించిన పలు పథకాలు, కోలిండియాలోని లేని మరికొన్ని పథకాలను యాజమాన్యం అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సింగరేణిపై సమీక్షించి, కార్మికుల సమస్యలు తెలుసుకొని వారి అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో సింగరేణి యాజమాన్యం కార్మికులకు కొత్త విశాలమైన డబుల్బెడ్రూం క్వార్టర్ల నిర్మాణం, దవాఖానల ఆధునీకరణ, ఆక్సిజన్ ప్లాంట్లు, లాభాల బోనస్ పెంపు, కార్మికుల పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, మ్యాచింగ్ గ్రాంట్, రూ.10 లక్షల వడ్డీలేని రుణం, ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదురు చూసిన ఏసీల కళ నెరవేర్చారు. ఉచిత కరెంట్ అమలు, ఇలా అనేక రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. 2014-15 నుంచి సంస్థ.. కార్మికుల సంక్షేమానికి రూ.727 కోట్లు ఖర్చు చేయగా, 2021-22లో రూ.1,363 కోట్లకు పెరిగింది. 2014-15లో సంక్షేమానికి ఒక్కో కార్మికుడిపై సగటున రూ.1.23 లక్షలు ఉండగా, 2021-22 వరకు రూ.3.12లక్షలకు చేరుకున్నది. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుడిపై వెచ్చించిన ఖర్చు 150 శాతం పెరిగింది. ప్రతి మహిళా ఉద్యోగినులకు ప్రత్యేక రిటైర్డ్మెంట్ స్కీం, మహిళలకు ఇది వరకు 12 వారాల ప్రసూతి సెలవులు ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 26 వారాలకు పెంచారు. చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేస్తున్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించారు. 2014 నుంచి కార్మికులకు అమలవుతున్నది. యేటా కార్మికుల కోసం రూ.259 కోట్లతో వైద్య సేవలు అందిస్తున్నారు. 126 సూపర్ స్పెషాలిటీ దవాఖానలతో అనుబంధ సేవల ద్వారా వైద్యం అందిస్తున్నారు. దాదాపు రూ.6 కోట్లతో సంస్థలోని 7 ఏరియా దవాఖానల్లో కావాల్సిన ఆధునిక వైద్య పరికరాలను కొనుగోలు చేసింది. పదేండ్లలో అవసరమైన స్పెషలిస్ట్ వైద్యులను నియమించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొవిడ్ సమయంలో కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించారు.
ఒకప్పుడు సింగరేణిలో పనిచేయాలంటే భయపడేవారు. భూ గర్భంలో దిగి బొగ్గు వెలికితీయడం ఎంతో కష్టమైన పని. నిత్యం పొంచి ఉన్న ప్రమాదాలతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కానరావడంలేదు. పూర్తి రక్షణతో కూడిన బొగ్గు వెలికితీస్తూ నష్టాల్లో ఉన్న గనులు లాభాల్లో పయనిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గనుల్లో రక్షణ పెంపుదలకు అదనపు నిధుల మంజూరు, అందరికీ తేలికపాటి ల్యాంపులు అందించారు. ప్రమాదాల నివారణకు అత్యాధునిక సిమ్యూలేటర్స్ ద్వారా శిక్షణ, ఓసీపీల్లో ప్రత్యేక రక్షణ చర్యలు, ప్రతీ గనిలో రక్షణ చర్యలపై ప్రత్యేక ఆడిట్, తదితర చర్యలతో పదేండ్ల కాలంలో సింగరేణిలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2014-15తో పాలిస్తే ప్రమాదాల సంఖ్య 42.86శాతంకు తగ్గింది. దీంతో సింగరేణి గనులు జాతీయస్థాయిలో అనేక అవార్డులు కూడా సొంతం చేసుకున్నాయి. మరోవైపు సింగరేణిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సింగరేణి రెస్యూ విభాగాన్ని అధునీకరించారు. ఇందు కోసం పదేండ్లలో రూ.36 కోట్లతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశారు. అనేక ప్రమాదాల్లో కార్మికులను, యంత్రాలను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. రక్షణ చర్యలు పటిష్టంగా ఉండడం.. ప్రమాదాలు తగ్గుముఖం పట్టడంతో కార్మికులు ఆందోళన చెందకుండా పనులు చేస్తూ సింగరేణిని లాభాల్లోకి తీసుకువస్తున్నారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణి గనులు కొత్త రూపు సంతరించుకున్నాయి. కార్మికులు గనుల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఉపరితలంలో సౌకర్యాలు ఉండేవి కావు. అరకొర వసతుల మధ్య పనిచేసేవారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్న కార్మికులకు భూ గర్భ గనుల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించడంతో గనుల స్వరూపమే మారిపోయింది. ప్రతి గనిలో మ్యాన్రైడింగ్ సిస్టం, గని ఆవరణలో పచ్చదనం, ప్రతీ గని వద్ద అంబులెన్స్ ఏర్పాటు చేశారు. భూ గర్భ గనులు, డిపార్ట్మెంట్లలో కోట్లాది రూపాయలతో క్యాంటిన్ల ఆధునీకరణ, లాకర్స్, శుద్ధనీటి జలాలు, టాయిలెట్స్, స్నానపు గదులు నిర్మించారు. క్యాంటీన్లలో తినుబండారాలు పెంచారు. గనుల్లో క్యాంటిన్లన్నీ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఫర్నిచర్, కొత్త కుర్చీలు, బెంచీలు, వేడి నీటి సిస్టం, చేతులు శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ వాష్ బ్లోయర్, గ్లీజర్లు ఏర్పాటు చేశారు. క్యాంటిన్లో నూతనంగా వంట పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, ఫ్యాన్లు కొనుగోలు చేసి, ఏర్పాటు చేశారు. క్యాంటిన్లతో పాటు గనులపై కార్మికులకు రెస్ట్ హాల్స్, సులబ్ టాయిలెట్స్, డ్రెస్సింగ్ రూంలు, అల్మారాలు ఏర్పాటు చేశారు.
సింగరేణి సంస్థ.. 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో 42 గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం సామాజిక బాధ్యతగా సమీప గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి చేయూతనందిస్తున్నది. గ్రామాల్లో రోడ్లు, నీరు, పాఠశాల భవనాలు, డ్రైనేజీల నిర్మాణం, ఉచిత వైద్య సేవలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, కళాశాల భవనాలు, యువతకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇచ్చింది. వీటి కోసం గత పదేండ్లలో డీఎంఎఫ్టీ కింద రూ.3వేల కోట్లు మంజూరు చేయగా, సీఎస్ఆర్ కింద రూ.335 కోట్లను విడుదల చేసింది. తద్వారా సింగరేణి పరిసర ప్రాంత గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా పదేండ్లలో గనులు, కాలనీలు, రహదారుల వెంట దాదాపు 6 కోట్ల మొక్కలు నాటారు. ప్రజలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు నాటిన దాఖలాలు లేవు. పర్యావరణహితం కోసం గనుల్లో నదుల ఇసుక వాడకాన్ని తగ్గించి ఓబీ నుంచి ఇసుక తీసే ప్రక్రియను మొదలు పెట్టింది. 2013-14లో ప్లాంట్ల ద్వారా మట్టి నుంచి 1.9లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తయారు చేయగా, 2022-23 వరకు 38,050 క్యూబిక్ మీటర్ల ఇసుకను తయారు చేశారు. ఈ పదేండ్ల తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇలా అనేక మార్పులు వచ్చాయి.
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవడంతో యాజమాన్యం వెంటనే అమలులోకి తీసుకువస్తుంది. 134 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో ఇప్పటివరకు అమలుకాని హామీలు, కార్మికుల చెంతకు చేరుతున్నాయి. సింగరేణిలోని దళిత, మైనార్టీ ఉద్యోగులను ఎవరూ పట్టించుకోలేదు. అంబేద్కర్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని కొన్నేండ్లుగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. హామీలకే పరిమితమైన నేతలు అమలు చేయడంలో విఫలమయ్యారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే మస్టర్తో కూడిన వేతనం పీహెచ్డీ(పెయిడ్ హాలీ డే) కల్పించి, దళిత ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపారు. వీరితో పాటు క్రిస్మస్, రంజాన్ పండుగలకు కూడా ప్రకటించారు. ఇది సింగరేణి పుట్టినప్పటి నుంచి అమలు చేయడం ఎవరితరం కాలేదు. కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది. ఇలాంటి హామీలను సింగరేణిలో పనిచేస్తున్న దళిత మైనార్టీ ఉద్యోగుల కోసం అమలు చేసి, వారికి గౌరవాన్ని అందించారు సీఎం కేసీఆర్.