కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 20: ప్రతి ఏడాది లాగే ఈనెల 23వ తేదీన జరిగే సింగరేణి 134వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి అధికారులు, ఉద్యోగులు, పరిసర ప్రాంత ప్రజలు విజయవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్ (పా, ఆపరేషన్స్) చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. మంగళవారం సింగరేణి హెడ్డాఫీస్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ దేశానికి వెలుగులు ఇచ్చే సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కలిగిస్తుందని, పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలకే తలమానికంగా నిలిచి 134 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సంస్థ మన సింగరరేణి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత సింగరేణి దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ సంస్థ చరిత్రలోనే మరిచిపోలేని విధంగా ఏర్పాట్లు చేస్తూ కోల్బెల్ట్ ప్రాంతంలోని 11 ఏరియాల్లోనూ సింగరేణి డే వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
11 ఏరియాలతో పాటు సెంట్రల్ ఫంక్షన్ను కొత్తగూడెం కార్పొరేట్లోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. వేడుకలకు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో నూతనంగా నిర్మించిన స్టేజీని కూడా అదేరోజు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు సీఎండీ సింగరేణి పతాకాన్ని ఆవిష్కరిస్తారని, వివిధ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రారంభిస్తారన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ సినీ, టీవీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పృథ్వీచంద్ర, ఎంఎల్ శ్రుతి, గాయత్రి, పాడుతాతీయగా ఫేమ్ శ్రీతేజ సినీ గేయాలు ఆలపిస్తారన్నారు. యాంకర్ శ్రుతిరెడ్డి వ్యాఖ్యతగా వ్యవహరిస్తారన్నారు.
ఆట ఫేం డ్యాన్సర్ రోహిత్ అండ్ టీం డ్యాన్స్ చేస్తుందన్నారు. జబర్దస్త్ ఫేం మొగిలి గుణాకర్, సుధీర్ కామెడీ నాటికలు ప్రదర్శిస్తారన్నారు. సీతాప్రసాద్ శిష్యబృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన ఇస్తారన్నారు. సింగరేణీయులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, పరిసర ప్రాంత ప్రజలు వేడుకలకు హాజరుకావాలని కోరారు. అనంతరం సింగరేణి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జీఎం పర్సనల్ వెల్ఫేర్, ఆర్సీ బసవయ్య, జీఎం పర్సనల్ (ఐఆర్, పీఎం) ఆనందరావు, జీఎం (ఈఈ, సీఎస్ఆర్) కుమార్రెడ్డి, డీజీఎం పర్సనల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.