జయశంకర్ భూపాలపల్లి, మే 4 (నమస్తే తెలంగాణ) : బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న సీహెచ్పీ(కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్)ల లోడింగ్ సామర్థ్యాన్ని ప్రస్తుతం 109 మిలియన్ టన్నుల నుంచి 133 మిలియన్ టన్నులకు పెంచాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో గురువారం సంస్థ డైరెక్టర్లు, జీఎంలు, సీహెచ్పీల మేనేజర్లతో సీహెచ్పీలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 10 ప్రధాన సీహెచ్పీలు, గనుల వద్ద ఉన్న 16 పిట్ హెడ్ సీహెచ్పీల పనితీరుపై సమీక్షించారు.
ఈ ఏడాది 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతోపాటు మరో రెండేళ్లలో 85 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధనకు కొత్త గనులను తెరుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సీహెచ్పీల బొగ్గు రవాణా సామర్థ్యాన్ని 2025-26 నాటికి 133 మిలియన్ ట న్నులకు పెంచాలని సూచించారు. ఈ ఏడాది కనీ సం 5 మిలియన్ టన్నులకు సామర్థ్యాన్ని పెంచాలన్నారు. దీని కోసం ఉప్పల్ సైడింగ్ వద్ద 2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల సీహెచ్పీని జీడీకే-5 ఓసీపీ వద్ద 1 మిలియన్ టన్నుల సామర్థ్యం గల సీహెచ్పీని ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ బొగ్గు రవాణాకు ఈ ఏడాది 2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల సీహెచ్పీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కొత్తగా ప్రారంభం కానున్న వీకే-7 ఓసీపీ వద్ద 10 మిలియన్ టన్నుల సామర్థ్యం గల సీహెచ్పీని ఒడిశా రాష్ట్రంలోని నైనీ వద్ద 10 మిలియన్ టన్నుల సామర్థ్యం గల సీహెచ్పీతోపాటు ఆర్జీ-2లో 5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల సీహెచ్పీని నిర్మించాలని ఇందుకు అనుమతులు, ప్రణాళికలు ఇప్పటి నుంచే అమలు చేయాలని ఆదేశించారు. మందమర్రికి సమీపంలో రూ.130 కోట్లతో రైల్వే సైడింగ్, సీహెచ్పీని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం కేకే-1 ఓసీపీ నుంచి ఉత్పత్తి చేసే బొగ్గును అక్కడ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న ఆర్కేపీ సీహెచ్పీకి రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తున్నారు. పర్యావరణ కోణంలో ఇది కొంత ఇబ్బందికరంగా ఉందని భావించిన సీఎండీ ఓసీపీకి పక్కన కి.మీ దూరంలో రైలు మార్గానికి ఆనుకొని మరో కొత్త సీహెచ్పీ నిర్మించాలని, అక్కడ నుంచి బొగ్గు రవాణా చేయడం కోసం రైల్వే సైడింగ్ కూడా నిర్మించాలని ఆదేశించారు. జూలై నాటికి పూర్తి చేయాలని సూచించారు.
సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో దాదాపు 80 శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకే సరఫరా అవుతున్నదని, ఇప్పటివరకు సీహెచ్పీల ద్వారా 250 ఎంఎం కన్నా తక్కువ సైజు గల బొగ్గు రవాణా చేస్తున్నదని తెలిపారు. విద్యుత్ సంస్థల్లో కొందరు తమకు 100 ఎంఎం కన్న తక్కువ సైజు గల బొగ్గు కావాలని కోరుతున్నారని, ఇందుకోసం టన్నుకు రూ.17 చొప్పున అదనంగా చార్జీలు చెల్లించేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. మార్పులు చేసి ఇకపై 100 ఎంఎం కన్న తక్కువ సైజు గల బొగ్గును రవాణా చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
2024-25లో ప్రారంభించనున్న నాలుగు కొత్త గనులపై సమీక్షించిన సీఎండీ నైనీ బొగ్గు బ్లాకు నుంచి ఈ ఏడాది 50 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలని, 2024-25 నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గు సాధించాలని ఆదేశించారు. మిగతా 3 కొత్త గనులకు రావాల్సిన ఉన్న అటవీ పర్యావరణ అనుమతులను జూలై నాటికి సాధించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి వీకే కోల్మైన్ నుంచి 45లక్షల టన్నులు, జేకే ఓసీపీ నుంచి 20లక్షల టన్నులు, గోలేటి ఓసీపీ నుంచి 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని తద్వారా మొత్తం మీద 20 మిలియన్ టన్నుల బొగ్గును కొత్త గనుల నుంచి ఉత్పత్తి చేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం, డైరెక్టర్ ఈ అండ్ ఎం డీ.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వీకే శ్రీనివాస్, డైరెక్టర్ పీపీ వెంకటేశ్వరరెడ్డి, అడ్వయిజర్ డీఎన్ ప్రసాద్, ఫారెస్ట్ అడ్వయిజర్ సురేంద్ర పాండే, ఈడీ కోల్ మూమెంట్ జే అల్విన్, జీఎం కో-ఆర్డినేటర్ ఎం సురేశ్ ఉన్నారు.