కొత్తగూడెం సింగరేణి, జనవరి 10 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రా పాలకుల హయాంలో పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాలతో పునరుద్ధరించారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా అవకాశాన్ని కల్పించారు. గతంలో జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో చేరపట్టారు. ఇప్పటివరకు 14,801 మంది డిపెండెంట్లకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వివిధ నోటిఫికేషన్లు డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా సుమారు 4,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులు సొంతింటి కలను సాకారం చేసేందుకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణాన్ని మంజూరు చేశారు. ఇప్పటివరకు 5,139 మంది ఉద్యోగులు లబ్ధి పొందారు. వీరికి సంబంధించిన వడ్డీని యాజమాన్యమే చెల్లిస్తున్నది. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్య సదుపాయం, కార్మికుల పిల్లలు ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, కార్మికులు నివాసం ఉండే క్వార్టర్లకు ఉచిత కరెంట్, ఏసీ సౌకర్యం. భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియా సత్తుపల్లిలో అత్యాధునిక విశాలమైన డబుల్ బెడ్రూం క్వార్టర్లను నిర్మించారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో కూడా దూసుకుపోతోన్నది.
శ్రీరాంపూర్లోని జైపూర్ వద్ద ఉన్న ఎస్టీపీపీలో 1200 మెగావాట్లతో పాటు మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి రూ.6800 కోట్లను కేటాయించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్తో పాటు ఎనిమిది ఏరియాల్లో 219 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిద్వారా 480 మిలియన్ యూనిట్లు విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేస్తున్నారు. తద్వారా సింగరేణి సంస్థ ట్రాన్స్కో ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ వాడకంలో 30శాతం మిగులుతుంది. తెలంగాణ రాకముందు సింగరేణి కార్మికులకు సగటున రూ.90 వేలు చెల్లించేవారు. ప్రస్తుతం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో కార్మికుడి సంక్షేమం కోసం రూ.3.10 లక్షల నిధులను కేటాయిస్తున్నది. సింగరేణి కార్మికులకు పదవీ విరమణ వయో పరిమితిని 60 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచారు.