భద్రాచలం, సెప్టెంబర్ 7: శ్రీమన్నారాయణుడి షోడశ కళల పరిపూర్ణ అవతారమే శ్రీకృష్ణ అవతారమని భద్రాద్రి దేవస్థానం అర్చకులు ఉపదేశించారు. ధర్నాన్ని పాటించిన వారే అసలైన విజేతలనేది శ్రీకృష్ణ పరమాత్ముడి తత్వమని బోధించారు. మానవుడు ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో అనే విషయాలన్నింటినీ భగవద్గీత ఉపదేశం చేస్తోందని వివరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం గురువారం వైభవంగా వేడుకలు నిర్వహించారు.
అర్చకులు ఉదయం శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉపాలయంలో ఉన్న శ్రీకృష్ణుడికి ఏకాంతంగా అభిషేక తిరుమంజనం జరిపారు. ఏటా శ్రావణ మాస కృష్ణపక్షం రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం సాయంకాలపు ఆరాధన, దర్బారు సేవ జరిగారు. అనంతరం స్వామివారిని బంగారపు ఊయలలో ఉంచి ఊంజల్ సేవను జరిపారు. దేవస్థానం వేద పండితులు శ్రీమద్భాగవతంలోని శ్రీ కృష్ణ జనన ఘట్టాన్ని భక్తులకు వివరించారు. ఆ తదుపరి శ్రీకృష్ణ పరమాత్మకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. దేవస్థానం ఈవో రమాదేవి, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శుక్రవారం ఉట్లు కొట్టే వేడుకను యాదవ రాజులతో చిత్రకూట మండపం ఎదుట నిర్వహించనున్నారు. అలాగే చప్టా దిగువన ఉన్న శ్రీరుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి (శ్రీకృష్ణ) ఆలయంలో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు.