కారేపల్లి, సెప్టెంబర్ 04 : కారేపల్లి మండలంలో గొర్రెలు, మేకలు, కోళ్లను దొంగిలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. సీఐ తిరుపతిరెడ్డి కేసు వివరాలను గురువారం వెల్లడించారు. కారేపల్లి ఎస్ఐ బైరు గోపి ఆధ్వర్యంలో పోలీసులు గురువారం ఉదయం ఉసిరికాయలపల్లి సింగరేణి ఓసి మూలమలుపు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇల్లెందు ఓసి గుట్ట నుండి అనుమానాస్పదంగా ఒక ఆటో, రెండు బైకులు రావడంతో వాటిని ఆపి తనిఖీ చేయగా ఆటోలో ఒక గొర్రెపోతు ఉంది.
అనుమానంతో వారిని విచారించగా దూడిమెట్ల శివయ్య, ఎల్లబోయిన సురేశ్, ఎల్లవుల గోపి, జంగిడి ప్రకాశ్ నలుగురు కలిసి గత కొద్ది రోజుల నుండి ఉసిరికాయలపల్లి, సీతారాంపురం, శాంతినగర్ గ్రామాలు, చుట్టుపక్కల ప్రాంతాలలో జీవాలు, కోళ్లను దొంగతనం చేసి వాటిని ఇల్లెందు, టేకులపల్లి ఏరియాలో అమ్ముతున్నట్లు వెల్లడించారు. గొర్రెపోతును అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 4 కేసులకు సంబందించిన ప్రాపర్టీతో పాటు ఆటో, రెండు మోటార్ సైకిల్స్, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.