ఖమ్మం వ్యవసాయం, జనవరి 11 : జిల్లాలోని రఘునాథపాలెం, ముదిగొండ, చింతకాని, తల్లాడ, వేంసూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో గల మిర్చి తోటలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారులు గురువారం పరిశీలించారు. మిర్చి పంట నాణ్యత కోల్పోవడం, తగ్గిన దిగుబడులకు గల కారణాలను అన్వేశించి సమగ్ర నివేదికను రూపొందించాలని సంబంధిత అధికారులకు రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింట్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శాస్త్రవేత్తలు, అధికారుల బృందం మిర్చి తోటలతోపాటు కల్లాలను సైతం సందర్శించారు.
జిల్లాలో కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల మిర్చి తోటలకు సోకిన తెగుళ్లు, మచ్చలు, తద్వార తగ్గిన దిగుబడులపై పరిశోధనతోపాటు రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో మిర్చి సాగు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, పురుగు మందుల పిచికారీ తదితర అంశాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ టీ.సురేశ్, కేవీకే శాస్త్రవేత్తలు రవి, ఏ.శైలజ, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్, వ్యవసాయ శాఖ డీడీ ఎస్.మోహన్రెడ్డి, డీఏవో విజయనిర్మల, జిల్లా ఉద్యాన శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బీవీ.రమణ, మార్కెటింగ్ శాఖ జేడీ వీ.శ్రీనివాస్, ఏడీఏ సరిత, డీఎంవో అలీం, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.