భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 8న యువత, మహిళలు, గ్రామస్తులు, ప్రముఖులు, అధికారులతో శ్రమదానం నిర్వహించాలని సూచించారు. అలాగే, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రహదారులపై ఉన్న గుంతలను పూడ్చాలన్నారు. రహదారులపై చెత్త కుప్పలు, మట్టి దిబ్బలను తొలగించి పరిశుభ్రం చేయాలని అన్నారు. 9న శుక్రవారం పంచాయతీల్లో ఉన్న డంపింగ్ యార్డులను సందర్శించి షెడ్లలో సెగ్రిగేషన్ జరిగే విధానాన్ని, కంపోస్టు తయారీ విధానాన్ని పరిశీలించాలని సూచించారు.
ఆ షెడ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. 10న రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని, పంచాయతీ పరిధిలోని అన్ని కచ్చా కాలువలను శుభ్రం చేయాలని సూచించారు. గ్రే వాటర్ను సోక్ పిట్ వైపు, కిచెన్ గార్డెన్ వైపు మళ్లించే విధంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. 11న మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, 12న మురుగు కాల్వలను శుభ్రం చేయాలని, పంచాయతీల్లోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. 13న పాఠశాలల పిల్లలకు, దేవాలయాల దగ్గర ఉన్న షాపుల బాధ్యులకు, హోటళ్ల నిర్వాహకులకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 14న యువతకు పారిశుధ్య కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహించాలని అన్నారు. 15న సామాజిక దురాచారాల నిర్మూలనపై అవగాహన కల్పించాలని, చురుగ్గా పాల్గొన్న వారికి సన్మానం చేయాలని సూచించారు.