సత్తుపల్లి, ఆగస్టు 20: సాంకేతిక విద్యను తామున్న ప్రాంతంలోనే చదవాలనే విద్యార్థుల కల నెరవేరింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సత్తుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితో పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు దూర ప్రాంతాలకు వెళ్లి చదివే భారం తప్పింది. పాలిటెక్నిక్ కోర్సును అభ్యసించేందుకు తమ పిల్లలకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. – సత్తుపల్లి, ఆగస్టు 20
అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న సత్తుపల్లి నియోజకవర్గంలో మరో మణిహారం చేరనున్నది. ఈ ప్రాంతంలో సింగరేణి గనులు ఉన్నప్పటికీ స్థానికులకు ఉపాధి ఉండదు. స్తోమత ఉన్న వారు సొంతంగా వ్యాపారం చేసుకోవడం, దొరికిన ప్రైవేటు ఉద్యోగం చేసుకోవడం తప్ప పెద్దగా అవకాశాలేమీ ఉండవు. దీంతో విద్యార్థులు చదువు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ పాలిటెక్నిక్, ఐటీఐ వంటి కళాశాలలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గ విద్యార్థులకు మేలు జరుగుతుందని విద్యావేత్తలు, పిల్లల తల్లిదండ్రులు దశాబ్దాల నుంచి ఆశిస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సు చదివేందుకు అవకాశం ఏర్పడింది. కోర్సులు చదివి ఎంతోమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటారు.
కళాశాలలో 180 సీట్లు..
కళాశాలలో సీఎస్ఈ, ఈఈఈ, సివిల్ గ్రూపుల్లో కోర్సులు ఉంటాయి. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున 180 సీట్లను భర్తీ చేయాల్సి ఉన్నది. వారికి పాఠాల బోధనతోపాటు ఇతర సేవలు అందించేందుకు ప్రభుత్వం 22 మందిని నియమించనున్నది. కళాశాల నిర్మాణానికి పదెకరాల భూమిని కేటాయించాలని ఇప్పటికే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. యంత్రాంగం ఈ మేరకు స్థలం కోసం కసరత్తు చేస్తున్నది. ఒకవేళ స్థలం అనుకున్న సమయానికి స్థలం సమకూరకపోతే వచ్చే విద్యాసంవత్సరం నుంచి తాత్కాలికంగా ప్రైవేటు భవనంలోనైనా కోర్సు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కోర్సు ఇలా..
పదోతరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులో చేరవచ్చు. కోర్సు మూడేళ్లపాటు ఉంటుంది. సాంకేతిక విద్య వైపు వెళ్లాలనుకునే వారికి ఈ కోర్సు చక్కటి ప్రత్యామ్నాయం. కోర్సు కేవలం మూడేళ్లలో పూర్తవుతుంది. డిప్లొమా కోర్సు పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగ అన్వేషణ చేయవచ్చు. లేదా ఉన్నత విద్య కోర్సులు చదవొచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనతికాలంలోనే ఉపాధి అవకాశాలు పొందాలనే ఉద్దేశంతో నాడు ‘ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ ఈ కోర్సును ప్రారంభించింది. ప్రస్తుతం కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పాలిటెక్నిక్ తర్వాత మెజార్టీ విద్యార్థులు ఉద్యోగ అన్వేషణలో పడేవారు. కానీ కొందరు కోర్సును బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ కోర్సుకు బ్రిడ్జి కోర్సుగా పూర్తి చేస్తున్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వెంటనే బీటెక్ సెకండియర్లో చేరుతున్నారు. పాలిటెక్నిక్ కోర్సు చదివిన విద్యార్థులు రైల్వేశాఖతో పాటు సింగరేణి వంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యం..
సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన యువతకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సత్తుపల్లికి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయించా. వచ్చే విద్యాసంవత్సరం నాటికి కోర్సు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం. అవసరమైతే తొలుత ప్రైవేటు భవనంలో కోర్సు ప్రారంభిస్తాం. కోర్సు నడుస్తుండగా సొంత భవనం నిర్మించే విధంగా ఏర్పాట్లు చేస్తాం.
– సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే, సత్తుపల్లి
పాలిటెక్నిక్ కళాశాల మంజూరు హర్షణీయం..
నియోజకవర్గ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేసింది. ఈ నిర్ణయం హర్షణీయం. కళాశాల మంజూరు కావడం ఈ ప్రాంత విద్యార్థులకు వరం. పాలిటెక్నిక్ మూడేళ్లలో పూర్తి చేసి విద్యార్థులు సులభంగా ఉద్యోగం సంపాదించవచ్చు. లేదా ఉన్నత విద్య వైపు అడుగులు వేయవచ్చు.
– మధుసూదన్రాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు, సత్తుపల్లి