మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడ్డారు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టెండర్లు దాఖలు చేశారు.. చివరి రోజు శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయాల్లో కోలాహలం నెలకొన్నది. కార్యాలయాలు ఔత్సాహికులతో కిటకిటలాడుతూ దర్శనమిచ్చాయి. దరఖాస్తుదారులు రాత్రి వరకూ ఓపిగ్గా ‘క్యూ’లో నిలబడి టెండర్లు వేశారు. టెండర్ల ద్వారా సర్కార్కు ఉభయ జిల్లాల నుంచి రూ.234.48 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 21న ఆశావహుల భవితవ్యం తేలనున్నది.
మామిళ్లగూడెం, ఆగస్టు 18: మద్యం దుకాణాల కోసం ఖమ్మం జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. చివరి రోజయిన శుక్రవారం రాత్రి 10.00 గంటల వరకు ఖమ్మం జిల్లాలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు బారులు తీరారు. ఖమ్మం జిల్లాలో 7,193 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.150 కోట్లకు పైగా ఆదాయం లభించింది. శనివారం అర్ధరాత్రి వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగింది. గత పాలసీలో ఖమ్మం జిల్లా నుంచి 6,215 దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటి ద్వారా రూ.123 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అంతకు మించి ఆదాయం వచ్చింది. శుక్రవారం మంచి రోజు, చివరి తేదీ కావడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతోపాటు ఏపీకి చెందిన వారు కూడా భారీగా దరఖాస్తులు ఇచ్చారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కుటుంబ సభ్యులు, మహిళల పేర్లతోనూ దరఖాస్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, గౌడలకు రిజర్వు చేసిన దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. నూతన మద్యం పాలసీతో 2021లో ఖమ్మం జిల్లాలో 122 దుకాణాలకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. గత పాలసీతో పోల్చుకుంటే ఈ ఏడాది 500 దరఖాస్తులు ఎక్కువ రావడంతో ప్రభుత్వానికి రూ.11 కోట్లకు పైగా ఆదాయం పెరిగింది. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్డులోని దుకాణానికి 147, ముదిగొండ మండలం వల్లభి దుకాణానికి 136 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో షాపునకు 45 నుంచి 65 వరకు దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ నెల 21న సీక్వెల్ ఫంక్షన్ హాల్లో లాటరీ ఉంటుంది. డిసెంబర్ 1న నూతన అబ్కారీ విధానం అమల్లోకి వస్తుంది.
కొత్తగూడెం క్రైం, ఆగస్టు 18: నూతన మద్యం పాలసీ.. వ్యాపారుల్లో ఫుల్ జోష్ నింపింది. చివరి రోజైన శుక్రవారం కొత్తగూడెంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు బారులు తీరారు. గత మద్యం పాలసీకి జిల్లాలోని 88 మద్యం దుకాణాలకు మొత్తం 4,271 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత పాలసీకి రిజర్వేషన్లు కొంత ఊరటనిచ్చాయి. గతంలో జిల్లాలోని మొత్తం 88 ఏ4 మద్యం దుకాణాలకుగాను ఏజెన్సీవి 44, నాన్ ఏజెన్సీవి 44 ఉన్నాయి. ప్రస్తుతం నాన్ ఏజెన్సీలోని 44 దుకాణాల్లో గౌడలకు 6, ఎస్సీలకు 7 రిజర్వయ్యాయి. మొత్తం 5,059 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.101.18 కోట్ల ఆదాయం సమకూరింది. పెద్దమ్మ తల్లి దేవస్థానం దుకాణానికి అత్యధికంగా 124 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 21న పాల్వంచలోని టీఎస్ జెన్కో హౌజింగ్ కాలనీ భద్రాద్రి ఆడిటోరియంలో డ్రా ఉంటుంది.
ఎస్సీ కులస్తుడి దరఖాస్తు స్వీకరణ
జిల్లాలో 44 మద్యం దుకాణాలను ఏజెన్సీ(ఎస్టీ)కి కేటాయించారని, ఎస్సీ కేటగిరీకి చెందిన తనకు కూడా దరఖాస్తు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మణుగూరు ప్రాంతానికి చెందిన కర్నె రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు పరిశీలించింది. రవి దరఖాస్తును స్వీకరించాలని, తుది తీర్పునకు అనుగుణంగా మద్యం దుకాణం కేటాయింపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. దీంతో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రవి ఇచ్చిన దరఖాస్తును ఎక్సైజ్ అధికారులు స్వీకరించారు.