సత్తుపల్లి/ సత్తుపల్లి టౌన్, మే 25: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని కలిసి మంజూరు పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. ఆర్అండ్బీ రోడ్ల మంజూరు కోసం పలుమార్లు తాను చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధుల్లో రూ.4.70 కోట్లతో చిన్నకోరుకొండి – ఆర్లపాడు రోడ్లు, రూ.5.50 కోట్లతో తల్లాడ – కొడవటిమెట్ట రోడ్డు, రూ.5 కోట్లతో కలకొడిమ – బస్వాపురం రోడ్డు నిర్మించనున్నట్లు వివరించారు. మరో రూ.27 కోట్లతో మరికొన్ని రహదారులు నిర్మిస్తామన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హైదరాబాద్లో కలిశారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి తన స్వగ్రామమైన కందుకూరులో ఆయన మాతృమూర్తి సోమకాంతమ్మ జ్ఞాపకార్థం నిర్మిస్తున్న జూనియర్ కళాశాలకు ప్రభుత్వపరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం సత్తుపల్లికి పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కూడా ఎమ్మెల్యే సండ్ర హైదరాబాద్లో కలిశారు. నీలాద్రి దేవాలయం, కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం దేవాలయం, సత్తుపల్లి హనుమాన్నగర్ దేవాలయాల పనులకు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు.