పెరిగిన భూ విలువతో రైతులకు ఊరట
పెరగనున్న రుణ పరిమితి, భూ నష్ట పరిహారం
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు ఏడాదికి రూ.350 కోట్ల ఆదాయం
వ్యవసాయ భూములపై రూ.100 కోట్ల ఆదాయం
ఖమ్మం, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి):ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూ రిజిస్ట్రేషన్లు వేగం పుంజుకున్నాయి. వ్యవసాయ భూముల విలువ 50 శాతం, వ్యవసాయేతర భూముల విలువ 50 నుంచి 60 శాతం వరకు పెంచడంతో వ్యవసాయదారులకు ఊరట లభించింది. పెరిగిన భూముల విలువలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 11 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. పెరిగిన భూ విలువతో రిజిస్ట్రేషన్శాఖకు ఏడాదికి రూ.350 కోట్ల ఆదాయం లభించనున్నది. నగరంతోపాటు సమీప గ్రామాలకు విస్తరించి ఉన్న స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో 45 గ్రామాలున్నాయి. వాటిలో కొన్ని ప్రాంతాల్లో 60 నుంచి 70 శాతం వరకు భూముల విలువ పెరిగింది. వ్యవసాయ భూముల ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూరనున్నదని అధికారులు అంచనా వేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువల ఆధారంగా ఉమ్మడి జిల్లాలో భూరిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. వ్యవసాయ భూముల విలువ 50శాతం, వ్యవసాయేతర భూముల విలువ 60 శాతం వరకు పెరగడంతో సాగుదారులకు ఊరట లభించింది. భూవిలువ ప్రకారం బ్యాంకులు రుణపరిమితి పెంచుతాయి. భూవిలువ సవరణ చాలా కాలం నుంచి లేకపోవడంతో రైతులకు నామమాత్రపు రుణాలు అందుతున్నాయి. భూపరిహారం ఎప్పుడో పాత రేట్ల ప్రకారం నిర్వాసితులకు అందుతున్నాయి. భూయాజమాని తన అవసరం కోసం తనఖా పెట్టే సందర్భంలోనూ అవసరానికి అనుగుణంగా రుణం లభించని పరిస్థితులు ఉండేవి. ప్రభుత్వ అవసరాలు, జాతీయ రహదారులకు భూములు ఇవ్వాల్సిన సమయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువ పరిగణలోకి తీసుకుని నష్ట పరిహారాన్ని ఇస్తుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ పెరిగిన భూవిలువ విముక్తి కల్పించనున్నది. కొత్త సవరణల ప్రకారమే ఇక నుంచి లావాదేవీలు జరుగనున్నాయి. జిల్లాలో రహదారుల విస్తరణ కోసం జాతీయ రహదారుల సంస్థ సేకరిస్తున్న గ్రీన్ ఫీల్డ్ భూములకు ఈ విలువ ప్రకారమే నష్ట పరిహారం అందనున్నది.
ప్రధాన ప్రాంతాల్లో ఇలా..
కల్లూరు, తల్లాడ, తిరుమలాయపాలెం, వేంసూరు, మధిర, కూసుమంచి మండలాల్లో భూమి రిజిస్ట్రేషన్ విలువ గత నెల వరకు రూ.3 లక్షలు మాత్రమే ఉండేది. ప్రభుత్వ వీటి విలువను 50శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రాంతాల్లో ఎకరా రిజిస్ట్రేషన్ విలువ రూ.4.5 లక్షలకు చేరింది. సత్తుపల్లిలో రూ.4.5 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.6.75 లక్షలు, ఇల్లెందు సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఎకరా రూ.2.20 లక్షలు ఉండగా రూ.3.37 లక్షలు, సుజాతనగర్లో రూ.3 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.4.50 లక్షలకు చేరింది.
సుడా పరిధిలో ఇలా ..
వ్యవసాయేతర భూములకు సంబంధించి ప్రస్తుతం ఖమ్మం నగరంలో అపార్టుమెంట్లపై చదరపు అడుగుకు 25శాతం పెరిగింది. సుడా పరిధిలో చదరపు గజం ధర రూ.1,200 ఉండగా రూ.1,500కు పెరిగింది. భూముల విలువలు సవరించక ముందే ప్రభుత్వానికి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఇతర సేవల ద్వారా సంవత్సరానికి రూ.250 కోట్ల ఆదాయం, పెరిగిన భూముల విలువల ద్వారా మరో రూ.100 కోట్లు అదనంగా ఆదాయం లభించనుంది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి రిజిస్ట్రేషన్శాఖకు రూ.350 కోట్ల ఆదాయం లభించనుంది. ఖమ్మం నగరంతో పాటు సమీప గ్రామాలకు విస్తరించి ఉన్న స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో 45 గ్రామాలు ఉండగా వీటిలో కొన్ని ప్రాంతాల్లో 60 నుంచి 70శాతం వరకు భూముల విలువలు పెరిగాయి. వ్యవసాయ భూముల ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు. ఖాళీ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విలువను 35శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం సవరించిన భూ విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూక్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీగా భూ విలువలు 7.5శాతం ప్రభుత్వం రుసుముగా రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.
పెరుగుతున్న ఆదాయం..
భూముల విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్శాఖ ఆదాయం అదే మొత్తంలో పెరుగుతున్నది. చార్జీలు భారీగా పెరుగుతాయని భావించిన రిజిస్ట్రేషన్దారులు కొందరు జనవరిలోనే పెద్ద మొత్తంలో లావాదేవీలు పూర్తి చేసుకున్నారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమలులోకి వచ్చిన ఈ నెల 1న ఉమ్మడి జిల్లాలోని 11 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 83 రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.20 లక్షల ఆదాయం లభించింది. ఈ నెల 2న 125 రిజిస్ట్రేషన్లు కాగా రూ 35 లక్షల ఆదాయం, 3న 130 రిజిస్ట్రేషన్లు కాగా వీటిలో 40 రిజిస్ట్రేషన్లు ఖమ్మం రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే జరిగాయి.. ఈ రిజిస్ట్రేషన్లతో రూ.40 లక్షల ఆదాయం లభించింది. 4న 135 రిజిస్ట్రేషన్లు కాగా రూ.42 లక్షల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ అయింది.
పెరిగిన విలువ ప్రకారం రిజిస్ట్రేషన్లు..
ప్రభుత్వం సవరించిన భూవిలువల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సవరించిన ధరలు అమలు చేస్తున్నాం. అవగహన కల్పిస్తున్నాం. రిజిస్ట్రేషన్లు సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. పెరిగిన భూవిలువల ద్వారా రిజిస్ట్రేషన్ల ఫీజు పెరగడంతో రిజిస్ట్రేషన్లశాఖకు ఆదాయం పెరిగింది. రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాం.
– రవీందర్, జాయింట్ రిజిస్ట్రార్