ఖమ్మం అర్బన్, మార్చి 15: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా చేసేందుకు జీవితాంతం శ్రమించిన మాస్టారు ఆయన. చదువుకుంటే కష్టాలు తొలగిపోతాయని, ఉన్నతస్థానాలను చేరుకోవచ్చని హితబోధ చెప్పిన మాస్టారు ఆయన. అలాంటి మాస్టారు విశ్రాంత జీవితం మాత్రం తీవ్రమైన మనసిక వేదనా భరితమైంది. అనారోగ్యంతో, మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. ఆయనే ఖమ్మంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీధర్. ఖమ్మంలో నివసిస్తున్న ఆయన.. 2024 నవంబర్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో హైదరాబాద్ కిమ్స్ వైద్యశాలలో దాదాపు రూ.1.2 కోట్లు వెచ్చించి లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. రెండు నెలల నుంచి హైదరాబాద్లో ఉండి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. శ్రీధర్ మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఒత్తిడితో..
ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న ఆయనకు ఎప్పటికీ నిరాశే మిగులుతోంది. ఎంతకీ అవి రాకపోవడంతో ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో నగదు అందకపోవడంతో ఆ ప్రభావం ఆరోగ్యంపై పడింది. కుటుంబ సభ్యులు అప్పులు చేసి మరీ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. అదే క్రమంలో బెనిఫిట్స్ రాలేదన్న ఒత్తిడి మరింతగా పెరగడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మృత్యువాతకు కారణమైంది. మృతిచెందిన విశ్రాంత జేఎల్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య వట్టికొండ వీరకుమారి టీచర్గానే పనిచేస్తున్నారు. పిల్లల్లో ఒకరికి వివాహమైంది. మరో కుమార్తె బీటెక్ చదువుతోంది. ఆయన గతంల అన్నపురెడ్డిపల్లి, దమ్మపేటలో జూనియర్ లెక్చరర్గా పనిచేశాడు.
శ్రీధర్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత..
అనారోగ్యంతోపాటు అప్పుల బాధతోమానసిక వేదనకు గురికావడం వల్లనే శ్రీధర్ మరణించారు. ఈ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపుల కోసం గత డిసెంబర్ నుంచి పలుమార్లు ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున కూడా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించినా అతడికి రావాల్సిన బెనిఫిట్స్ విడుదల చేయలేదు.
-రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, యూటీఎఫ్ ఖమ్మం జిల్లా నేతలు