రుద్రంపూర్, ఫిబ్రవరి 18 : బుధవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. సాయంత్రం వేళలో నెలవంక కనిపించినట్లు రుయాతే హిలాల్ హైదరాబాద్ (దక్కన్) కమిటీ వెల్లడించింది. దీంతో మసీదుల్లో సైరన్లను మోగించారు. ఒకరికొకరు చాంద్ ముబారక్ (నెలవంక దర్శనం) శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇషా నమాజి తర్వాత ప్రత్యేక తరబీహ్ నమాజీలు ప్రారంభం కావడంతో ముస్లీంల ఇళ్లలో రంజాన్ సందడి మొదలైంది.
వారం సహార్తో ఉపవాసాలు (రోజు) ప్రారంభమయ్యాయి. రంజాన్ మాసం 30వ రోజున షవ్వాల్ మాసం నెలవంకను చూసి తెల్లవారాక ఈద్ ఉల్ ఫిత్ రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ముస్లిం సోదరులలో మొదలైన సందడి గురువారం ఉదయం నుండి రోజా ఉపవాస దీక్ష మొదలుకానున్న నేపథ్యంలో రేపు ఉదయం కోసం కావాల్సిన సరుకులను, పాలను, పండ్లను ఇతర సరుకులను సమకూర్చే పనులు నిమగ్నమై ఉన్నారు.
ఇస్లాం నాల్గవ మూల స్తంభం ఉపవాసం. ఉపవాసాన్ని అరబీబాష ఇస్లాం దర్శశాస్త్ర పరిభాషలో సామ్ అంటారు. ఉపవాసం అంటే అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు దూరంగా ఉండడంతో పాటు ఉపవాసానికి భంగపరుచు కార్యాలన్నింటికీ విడనాడడం. ఉపవాసాలను ముస్లీంలకు ఫర్జ్ (విధి)గా నిర్ణయించబడింది. ధర్మపరమైన కారణాలు లేకుండా ఉపవాసం పాటించినట్లయితే అతను ఫాసిక్ దురాచారి అవుతాడని హదీస్ చెబుతోంది.
ఉపవాస సంకల్పంతో ఉషోదయానికి ముందు తెలవారుజామున ఏదైనా అల్పాహారం తినడం, తాగడాన్ని సహెరి అంటారు. సహెరి భుజించడం ప్రవక్త సంప్రదాయం. సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు. సూర్యుడు అస్తమించినట్లు తెలిస్తే ఉపవాసాన్ని వెంటనే విరమించాలి. ఇస్లాం ధర్మశాస్త్రంలో ఉపవాసం (రోజ) పగలు మాత్రమే. ఇఫ్తార్ విందు ఇచ్చేవారికి అల్లాహ్ ఎంతో పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడని ప్రవక్త తెలిపారు.
రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతికగా నిలుస్తాయి. రాజరికపు వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య పాలనలో ఇఫ్తార్విందులకు ప్రాధాన్యం ఉంది. సోదరభావం పెంపొంది.. ఐకమత్యంగా జీవించడానికి దోహదపడుతున్నాయి. రాష్ట్రపతి నుంచి మొదలుకొని గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అధికారికంగా ఇచ్చే ఇఫ్తార్ విందుల వెనుకసామాజిక అంశాలు దాగి ఉన్నాయి. దేశ ప్రతిష్టను పెంచడమే కాకుండా భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని చాటి చెబుతాయి. గంగా జమున తహజీబ్ అలాగే కొనసాగాలని అశాంక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మతాలకు, కులాలకు అతీతంగా ఇఫ్తార్ సమయంలో పండ్లు ఫలాలు మసీదులకు పంపించడం అనవాయితీగా వస్తోంది.