Karepally Railway Reservation | కారేపల్లి: కరోనా సమయంలో కారేపల్లి రైల్వే స్టేషన్లో రద్దు చేసిన రిజర్వేషన్ కౌంటర్ను రైల్వే అధికారులు ఎట్టకేలకు పునరుద్ధరించారు. ఖమ్మం జిల్లాలో ఏకైక రైల్వే జంక్షన్ కారేపల్లి రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ లేకపోవడంతో నాలుగేండ్లుగా ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో ఈ రైల్వే లైన్లో ఎక్స్ ప్రెస్ రైళ్ళు నడుస్తున్నాయి.
ఆ రైళ్లకు రిజర్వేషన్ కావాలన్నా, తత్కాల్ టికెట్లు కావాలన్నా ఈ ప్రాంత ప్రజలు ఖమ్మం, కొత్తగూడెం, డోర్నకల్ రైల్వే స్టేషన్లకు వెళ్లి రిజర్వేషన్ చేయించుకోవాలి. తర్వాత కారేపల్లి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాల్సిన దుస్థితి నెలకొని ఉండేది. దీనితో ఈ విషయమై రైల్వే అధికారులకు స్థానికులు, ప్రయాణికులు పలుసార్లు మొరపెట్టుకున్నారు.
ఎట్టకేలకు రైల్వే అధికారులు శనివారం నుండి రిజర్వేషన్ కౌంటర్ను పునరుద్ధరించారు. రిజర్వేషన్ కౌంటర్ను పునరుద్ధరించినందుకు రైల్వే అధికారులకు సహకరించిన ప్రజాప్రతినిధులకు సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ రైల్వే లైన్ లో రద్దు చేసిన మిగతా రైళ్లను కూడా పునరుద్ధరించి డోర్నకల్ నుండి భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) వరకు గల అన్ని రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్లకు హాల్టింగు ఇవ్వాలని సామాజిక కార్యకర్త సురేందర్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు.