POCSO Act | కొత్తగూడెం క్రైం, మార్చి 27: వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. సామాజిక స్పృహతోపాటు సాంకేతికత పెరుగుతున్నది.. మనుషులు కూడా కాలానుగుణంగా అప్గ్రేడ్ అవుతూనే ఉన్నారు.. కానీ కొంతమంది మనస్తత్వాలు మాత్రం ఇంకా మోడుబారిపోతున్నాయి.. ఇందుకుకారణం చేతిలో సెల్ఫోన్.. అందులో హైస్పీడ్ ఇంటర్నెట్.. ఆ స్పీడ్కి తగ్గ పోర్న్ సైట్లలో వచ్చే అశ్లీల దృశ్యాలే అని మానసిక నిపుణులు చెబుతున్నారు. మస్తిష్కాల్లో మెదిలే మానసిక సంఘర్షణలతో క్రూరత్వాన్ని అలవర్చుకుంటున్నారు. చిన్నారులపై సైతం లైంగికదాడులకు పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇటువంటి ప్రబుద్ధులు ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టానికి చిక్కి దశాబ్దాలపాటు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఐదేళ్లలో జరిగిన ఘటనలు మాయని మచ్చలా మిగిలాయి.
మానవత్వాన్ని మరిచి క్రూరత్వంతో వ్యవహరించిన కామాంధులు కొందరు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన సదరు మృగాళ్లు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. పాతికేళ్ల నుంచి 50ఏళ్లు దాటిన ఆ నేరగాళ్లు సుమారు రెండు దశాబ్దాలకు పైనే కఠిన కారాగార శిక్షలు పడి జైల్లో జీవితాలను గడిపేస్తున్నారు. అవగాహన లోపాలతో చేసిన తప్పలు ఇప్పడు వారి జీవితాలనే ఛిధ్రం చేశాయి. ఇప్పుడు వారున్న వయసు రీత్యా జైల్లో జీవితాలను గడిపి వృద్ధాప్యంలో చెర నుంచి విముక్తులవుతారు. దీంతో వారి కలలన్నీ కలగానే మిగిలిపోనున్నాయి. పాఠాలు చెప్పే బడి పంతులు మొదలుకొని, వరుసలు మరిచి కొందరు, కన్నకూతురనే బేధాన్ని విస్మరించి మరికొందరు.. ఇలా జిల్లాలో అనేక ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
‘పోక్సో’ చట్టం బాలికలకు రక్షణ వలయంగా నిలుస్తున్నది. బాలికలపై లైంగికదాడులకు పాల్పడే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినచర్యలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు పదుల సంఖ్యల్లో నేరస్తులు ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ మూడేళ్లల్లో జిల్లాలో 32 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో 2020లో 134 కేసులు నమోదవ్వగా 38 పెండింగ్ ట్రైల్లో ఉన్నాయి. రెండు కేసుల్లో నిందితులకు జైలు శిక్ష పడింది. 2021లో 131 కేసులు నమోదవ్వగా 59 పెండింగ్ ట్రైల్లో ఉన్నాయి. ఒకరికి జైలుశిక్ష పడింది. 2022లో 98 కేసులు నమోదవ్వగా 71కేసులు పెండింగ్ ట్రైల్స్లో ఉన్నాయి. 9 కేసులు దర్యాప్తులో ఉన్నాయి. 2023లో ఇప్పటివరకు 26 కేసులు నమోదవ్వగా ఒక కేసు పెండింగ్ ట్రైల్లో ఉంది. 23కేసులు దర్యాప్తులో ఉన్నాయి. ఈ మొత్తం కేసుల్లో ఐదుగురు 20 ఏండ్లపైనే జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
మహిళలు, బాలికల రక్షణే ప్రథమ లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తున్నది. చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడేవారిపై ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితరగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. షీ టీమ్స్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, బస్టాండు, రైల్వేస్టేషన్లతోపాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరిస్తున్నాం. అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఎన్నో కేసుల్లో నేరస్తులను కోర్టులో ప్రవేశపెట్టి, సాక్ష్యాధారాలను సమర్పించాం. ఎంతోమంది 15నుంచి 25సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
– ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న
భద్రాద్రి జిల్లాలో కొందరు ప్రబుద్ధులు చిన్నారులపై చేసిన లైంగికదాడులకు జైల్లో శిక్షలను అనుభవిస్తున్నారు. దుమ్ముగూడెం పోలీస్స్టేషన్ పరిధిలోని తూరుబాక గ్రామానికి చెందిన 18నెలల పసికందుపై అజ్మీరా సాయి కిరణ్ అనే యువకుడు చేసిన లైంగికదాడిపై బాధితుల ఫిర్యాదు మేరకు 2018వ సంవత్సరం జూన్ 24న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతడిపై పోలీసులు తగిన ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి 25ఏండ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 22న కొత్తగూడెం జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.