భద్రాచలం, డిసెంబర్ 8: ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల ప్రకారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో నూతన పూజలు/సేవలు అమలు జరిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. భక్తులు వారం రోజుల్లోగా తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు. ప్రతిపాదించిన పూజలు/సేవల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిపాదిత టికెట్ రూ.500పై దర్శనం అనంతరం బేడా మండపంలో వేదాశీర్వచనం చేస్తారు. స్వామివారి తులసి మాల అలంకరణ కోసం ప్రతిపాదిత టికెట్ ధర రూ.1000. ఈ టికెట్ తీసుకున్న వారికి జాకెట్ పీస్, కండువా, రెండు చిన్న లడ్డూలు ఇస్తారు.
స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ టికెట్ ధర రూ.5 వేలు. ఈ టికెట్ కొనుగోలు చేసిన వారి పేరిట ప్రతి రోజూ నిత్య సర్వ కైంకర్య సేవలు నిర్వహిస్తారు. దీనినే ఉదయాస్తమాన సేవగా పిలుస్తారు. శ్రీరామనవమి ముత్యాల సమర్పణ టికెట్ రూ.10 వేలు. దీనిపై శ్రీరామనవమి కల్యాణ టిక్కెట్ (ఉభయం), ఉభయ దాతకు కల్పించే అన్ని సౌకర్యాలు, 108 ముత్యాల తలంబ్రాలు ఇస్తారు. నిత్య పూల అలంకరణ సేవ టికెట్ రూ.5 వేలు. దీనిపై దంపతులకు అంతరాలయంలో అర్చన చేస్తారు. తులాభారం (ప్రతి రోజూ) టికెట్ ధర రూ.100. అదనపు సమాచారం కోసం 08743-232428, 9705192935, 7660007675 నెంబర్లలో సంప్రదించాలని ఈవో కోరారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించే ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల ఏర్పాట్ల గురించి ఈ నెల 12న సాయంత్రం 4 గంటలకు కొత్తగూడెంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు. డిసెంబర్ 23 నుంచి మత్స్యవతారంతో స్వామివారి అవతారాలు ప్రారంభమవుతాయని, జనవరి 1న గోదావరి తీరంలో హంస వాహనంపై స్వామివారికి తెప్సోత్సవం, 2న వైకుంఠద్వార దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.