ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పంట పండింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఆరేండ్లలో ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. దీంతో మత్స్య రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. ‘మిషన్ కాకతీయ’, ప్రాజెక్టుల నిర్మాణంతో చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లల పంపిణీ, రుణాలు, మార్కెటింగ్ సదుపాయం, సమీకృత చేపల మార్కెట్, మత్స్యకారులకు బీమా, ప్రత్యేక శిక్షణతో ప్రోత్సహిస్తుండడంతో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మంచి నీటిలో పెరిగే చేపల ఉత్పత్తులకు ఫుల్ గిరాకీ ఉండడంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చెరువుల కింద పంటల సాగు, చేపల పెంపకంతోపాటు చెరువే ఆధారంగా జీవించే అందరి కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
– కూసుమంచి, జనవరి 28
కూసుమంచి, జనవరి 28 : చెరువుల్లో నీళ్లు లేవు.. కరెంట్ లేదు.. పంటలూ పండలేదు.. చెరువుపై ఆధారపడిన కుటుంబాల జీవన పరిస్థితి దయనీయం.. ఇది ఒకప్పటి దుస్థితి. ఇప్పుడు దీనికి భిన్నంగా మారింది.. ఎక్కడచూసినా చెరువులనిండా నీళ్లు.. 24 గంటల కరెంట్, పుష్కలంగా రెండు పంటలు పండుతున్నాయి. వీటికి తోడు చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. అప్పుడు చెరువుల్లో నీరు లేక కూలీనాలీ పనులకు పోయి జీవనం సాగించిన కుటుంబాలు నేడు జీవనప్రమాణం పెరిగి ఆనందంగా జీవిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మత్స్యకారులే వాటాలు వేసుకొని చేపపిల్లలు కొనుగోలు చేసేవారు. చెరువుల్లో పెరిగిన కొద్దిచేపలు గ్రామానికే సరిపోని పరిస్థితి ఉండేది. కానీ నేడు ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉంది.
మిషన్ కాకతీయ’ పథకం ద్వారా చెరువుల్లో పూడికలు తీయడంతో నీరు సంవృద్ధిగా ఉంది. రాష్ట్రమంతటా మిషన్ కాకతీయ పనులు పూర్తయిన తర్వాత ఈ ఆరేండ్లలో చేపల ఉత్పత్తులు 1.5 లక్షల టన్నుల నుంచి 3.10 లక్షల టన్నులకు పెరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చేపల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ప్రత్యేక శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో కరువు జాబితాలో మొదటిస్థానంలో ఉన్న తిరుమలాయపాలెంలో నేడు చెరువుల్లో భక్తరామదాసు ప్రాజెక్టుతో జలకళ సంతరించుకున్నది. దశాబ్ధాలుగా నిండని గట్టుసింగారం చెరువు అలుగుపారి నీటితో కళకళలాడుతున్నది. అప్పట్లో మార్కెట్లో ఐస్ చేపలు, సముద్రపు చేపలు మాత్రమే దొరికేవి.. కానీ నేడు బతికున్న చేపలు అమ్ముతున్నారు.
చేపలకు ఫుల్ డిమాండ్..
ప్రస్తుతం మాంసం వినియోగం బాగా పెరిగింది. మటన్ కిలో రూ.800 ఉండడంతో చేపలకు డిమాండ్ బాగా పెరిగింది. చేపలు కిలో రూ.120 నుంచి రూ.150 వరకు దొరుకుతున్నాయి. దీంతో ఆదివారం వచ్చిందంటే చాలు చేపల మార్కెట్ల వద్ద తట్టల్లో అమ్ముకునే వారి వద్ద జనం కిక్కిరిస్తున్నారు. బయట నుంచి వచ్చిన ఐస్చేపలు ఎక్కువగా మార్కెట్లో దొరుకుతున్నాయి. చేపల ధర తక్కువగా ఉండడం.. గ్రామాల్లోని అన్ని చెరువుల్లో చేపలు దొరకడంతో కొంతవరకు ఇబ్బంది లేకుండాపోయింది.
గణనీయంగా పెరిగిన మత్స్య సంపద
తెలంగాణ రాష్ట్రం రాకముందు కంటే వచ్చిన తర్వాత చేపల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకు తిరుమలాయపాలెం మండలంలో ఒక్క చెరువులో కూడా చేపలు ఉండేవికావు.. కానీ నేడు ఇరవైకి పైగా కుంటలు, చెరువుల్లో చేపలు పెంచుతున్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీ, రుణాలు, మార్కెటింగ్ సదుపాయం, సమీకృత చేపల మార్కెట్ ఏర్పాటు, మత్స్యకారులకు బీమా ఇలా అనేక వసతులు కల్పించడంతో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. గతంలో చేపల పెంపకంపై ఎలాంటి శిక్షణ లేదు.. కానీ నేడు రాష్ట్రంలో ఏకైక మత్స్య పరిశోధనా కేంద్రం పాలేరులో చేపల పెంపకం యాజమాన్య పద్ధతులపై ఇస్తున్న శిక్షణ చేపల పెంపకందారులకు బాగా ఉపయోగపడుతున్నది.
– ఆంజనేయస్వామి, మత్స్యశాఖ జిల్లా అధికారి
ఐదేండ్లలో 2,700 మందికి శిక్షణ ఇచ్చాం..
చేపల వినియోగం చాలా పెరిగింది. అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి జరగడం లేదు.. కానీ గతంతో పోలిస్తే ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. సమీకృత చేపల పెంపకంపై మత్స్యకారులకు శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన మత్స్య రైతులకు ఐదేండ్లలో పాలేరులో వివిధ దశల్లో 2,700 మందికి శిక్షణ ఇచ్చాం.. యాజమాన్య పద్ధతలు నేర్పించాం. క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయించాం. మహిళలకు సైతం శిక్షణ ఇచ్చాం.. చేపల వంటకాల తయారీలో కూడా శిక్షణ ఇచ్చాం. ప్రధానమంత్రి మత్స్య సంవృద్ధి యోజన, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శిక్షణ ఇస్తున్నాం.
– జి.విద్యాసాగర్రెడ్డి, మత్స్య శాస్త్రవేత్త, పాలేరు