ఖమ్మం రూరల్, మే 26: ఉమ్మడి పాలకులు వ్యవసాయం దండగ అన్నారు. అందుకు అనుగుణంగానే రైతులపై శీతకన్ను వేశారు. రైతు సంక్షేమ పథకాల ఊసే లేదు. అలాంటి పరిస్థితుల్లో కొందరు రైతులు పుట్టిన ఊరిని, భూమిని విడిచి పిల్లాపాపలతో పట్టణాలకు వచ్చారు. కూలీ నాలి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్నారు. ఊళ్లో మిగిలిన రైతులు మాత్రం ఊరిని విడిచిపెట్టలేక, భూమిని వదులుకోలేక వ్యవసాయం చేశారు. ప్రతి సీజన్కు ముందు విత్తనాల కోసం ఎదురుచూశారు. ఎరువుల కోసం దుకాణాల ఎదుట బారులుతీరారు. పంటకు నీరు పెట్టేందుకు కరెంట్ లేక బావుల వద్ద పడిగాపులు కాశారు. ఇలా నాడు రైతు చితికిపోయాడు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని రైతుల పక్షాన నిలిచారు. రైతు పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా రైతుబీమా అనే పథకాన్నీ అమలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఓ రైతు చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడకుండా, పిల్లల చదువులు ఆగకుండా ఉండేందుకు రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నారు. అలా ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలం గ్రామానికి చెందిన ఓ కుటుంబమూ గడ్డుపరిస్థితుల నుంచి బయపడింది.
కుటుంబ నేపథ్యం ఇలా..
ఎం.వెంకటాయపాలేనికి చెందిన మునిగంటి కృష్ణకు భార్య పద్మ, కుమార్తె, కుమారుడు. కృష్ణకు గ్రామంలో 30 గుంటల భూమి ఉంది. ఉన్న కాస్త భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబ పోషణ భారమై ఓ గ్రానైట్ క్వారీలో కూలీగా పనిచేసేవాడు. కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేది. ఇలాంటి పరిస్థితిలో కృష్ణ గతేడాది అనారోగ్యంతో మృతిచెందాడు. దహన సంస్కారాలు, దశ దిన కర్మలు నిర్వహించేందుకూ భార్య పద్మ ఇబ్బంది పడింది. ఆర్థిక వనరులు సమకూరక సతమతమైంది. ఆ కుటుంబం కుంగిపోయింది. తర్వాత పిల్లలను ఎలా పోషించాలి.. ఎలా చదివించాలనే ఆందోళన పద్మలో మొదలైంది.
ఆదుకున్న బీమా పరిహారం..
కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే ఇక ఉన్న కాస్త భూమిని అమ్మడం ఒకటే పరిష్కారం అనుకున్నది పద్మ. సరిగ్గా ఈ సమయంలోనే గ్రామపెద్దలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రైతుబీమా గురించి వివరించారు. పద్మ వెంటనే ఏఈవో ద్వారా రైతుబీమా దరఖాస్తు చేసుకున్నది. వ్యవసాయశాఖ అధికారులు కొద్దిరోజుల్లో పద్మ ఖాతాలో రూ.5 లక్షల పరిహారం జమ చేయించారు. మొదట పద్మ పరిహారం అందుతుందని నమ్మలేదు. ఖాతాలో జమ అయిన తర్వాత పథకం విలువ తెలుసుకున్నది. అందిన సొమ్ముతో పద్మ శిథిలావస్థలో ఉన్న ఇంటిని బాగు చేయించింది. కొన్ని అప్పులు తీర్చింది. మిగిలిన సొమ్మును కుమార్తె పెండ్లికి బ్యాంక్లో డిపాజిట్ చేసింది. ప్రస్తుతం కుమార్తెను ఇంజినీరింగ్, కుమారుడిని డిగ్రీ చదివిస్తున్నది. రైతుబీమా అందకపోతే ఉన్న కాస్త భూమి మిగిలేది కాదని, పిల్లలు చేతికి వచ్చేవారు కాదని పద్మ వెల్లడిస్తున్నది. రైతుబీమా రైతు కుటుంబాలకు వరమని పేర్కొంటున్నది.
దేవుడసొంటి మనిషి సీఎం కేసీఆర్..
మా కుటుంబానికి కేసీఆర్ దేవుడుతో సమానం. బీమా అందకపోతే కుటుంబం వీధిన పడేది. నా భర్త చనిపోయిన తర్వాత అప్పు చేసి దశ దిన కర్మలు చేశా. తర్వాత అప్పులు ఎలా తీర్చాలి? పిల్ల పెళ్లి ఎలా చేయాలి ? పిల్లలు ఎలా చదివించాలి? అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. బీమా కోసం దరఖాస్తు చేసుకోమని కొందరు చెప్పారు. నేను బీమా కోసం ఎంతకాలం వేచి చూడాలో.. ఎంత సమయం పడుతుందో అనుకున్నా. కానీ దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే వ్యవసాయశాఖ అధికారులు నా ఖాతాల్లో రూ.5 లక్షలు జమ చేయించారు. సొమ్ముతో సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్నా.
– మునిగింటి పద్మ, ఎం.వెంకటయపాలెం, ఖమ్మం రూరల్