‘పట్టా’ల సంతోషం మరువకముందే సర్కారు మరో వరాల‘మూట’ ఇచ్చింది. హక్కుదారుగా పట్టా అందిందే తడవుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతుబంధు సాయాన్ని పోడు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. కాగితాలు పట్టుకొని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండానే సీఎం కేసీఆరే ‘బంధు’వులా పోడు బిడ్డలకు భరోసా కల్పించారు. ఇటు పోడు పట్టాలు.. అటు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతుంటే గిరిజనులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. దశాబ్దాల కాలంలో ఏ ప్రభుత్వమూ ఆదుకోని విధంగా తెలంగాణ ప్రభుత్వం అక్కున చేర్చుకోవడంతో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు చెబుతూ జేజేలు పలుకుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 3 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఒక్కసారి ఒక పని చేపట్టారంటే అది ముగించే వరకు వదలిపెట్టరు. అందుకు తాజా తార్కాణం పోడు పట్టాల పంపిణీ. పోడు రైతులకు పట్టాలు అందిస్తామని ఇచ్చిన హామీని అక్షరాల నిలబెట్టుకున్నారు. అంతేనా.. పట్టాలు తీసుకున్న ప్రతి పోడు రైతు ఖాతాల్లో వెంటనే రైతుబంధు జమ చేయిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమంటే ఇదే. పట్టాలు, పెట్టుబడిసాయం ఒకేసారి అందించడంతో ఆదివాసీల ఆనందానికి అవధులు లేకపోయాయి. భద్రాద్రి జిల్లాలో గత నెల 30న ప్రారంభమైన పట్టాల పంపిణీ సోమవారానికి ఊపందుకున్నది. ఇల్లెందు నియోజకవర్గంలో పోడుపట్టాలు అందుకున్న రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అయినట్లు మొబైల్స్కు సందేశాలు రావడం ఆనందాన్నిచ్చిందని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు.
వానకాలం సీజన్కు జిల్లావ్యాప్తంగా 1,42,199 మంది రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉన్నది. అందుకు ప్రభుత్వం రూ.213 కోట్లు విడుదల చేసింది. ఒకవైపు పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. అలాగే తాజాగా పోడు రైతులకు పట్టాలు అందాయి. జిల్లావ్యాప్తంగా 44,038 మంది పోడు రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతుబంధు జమకానున్నది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.67 కోట్లు మంజూరు చేసింది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం రైతుబంధు లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య 1,86,211 మంది.
1,86,211 మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేసేందుకు సర్కార్ రూ.280.91 కోట్లు మంజూరు చేయగా వాటిలో ఇప్పటికే 1,28,123 మంది ఖాతాల్లో జమ చేసేందుకు రూ.139.75 కోట్ల సొమ్ము ట్రెజరీకి చేరుకున్నది. ఈ సొమ్ములో ఇప్పటికే 1,11,048 మంది ఖాతాల్లో రూ.98.43 కోట్లు జమయ్యాయి. వారం రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి కానున్నది.
వానలు కురవంగానే
డబ్బులు ఇస్తే ఒక్కరోజులో ఖర్చవుతాయి. కానీ సీఎం కేసీఆర్ సారు మాకు భూమిపై హక్కు కల్పించిండు. భూమి తరతరాలకు చెందే ఆస్తి. మా పిల్లలకు ఆసరా. పోడు పట్టాలు అందించిన సీఎం కేసీఆర్కు దండాలు. అడవిని నమ్ముకుని జీవిస్తున్న మాకు పట్టా ఇచ్చి బతుకుపై ఆశ వచ్చింది. నాకున్న ఎకరం పావు భూమికి నా ఖాతాలో రూ.7,750 పెట్టుబడిసాయం జమ అయింది. వానలు కురవంగానే ఇక సాగు మొదలుపెడతాం..
– శ్యామల వెంకటేశ్వరరావు, పోడు రైతు, గౌరారం, దుమ్ముగూడెం మండలం
పోడు పట్టా అందినందుకు ఎంతో ఆనందించాం. రైతుబంధు సొమ్ము ఖాతాలో జమ అయిన తర్వాత ఆ ఆనందం రెట్టింపు అయింది. పట్టా అందిన రెండు రోజులకే పెట్టుబడి సాయం అందించడం సీఎం కేసీఆర్కే సాధ్యమైంది. నాకున్న రెండెకరాలకు గాను ఎకరానికి రూ.5 వేల చొప్పున ఖాతాలో రూ.10 వేలు జమ అయింది. అసలు పట్టా రాదనుకున్నాం.
– చీమల భాస్కర్, పోడు రైతు, రోళ్లపాడు, టేకులపల్లి మండలం
ఎన్నో ఏండ్ల నుంచి పోడు భూమిని సాగు చేసుకుంటున్నాం. పంట వేశాక అటవీ అధికారులు పంటను నాశనం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎంతో మంది అధికారులకు మా బాధలు చెప్పుకున్నా సమస్య తీరలేదు. సీఎం కేసీఆర్ సారు పోడు రైతులకు శాశ్వత పరిష్కారం చూపించారు. మా బాధలు పూర్తిగా తొలిగిపోయాయి. రైతుబంధు, రైతుబీమా వర్తింపజేసి మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. సీఎం కేసీఆర్ సార్ను ఎప్పటికీ మర్చిపోం.
– ఈసం శ్రీరామ్మూర్తి, కొత్తూరు, కరకగూడెం మండలం
పోడు పట్టా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో అటవీ అధికారులతో నానా ఇబ్బందులు పడ్డాం, ఎన్నో కేసులు భరించాం. ప్రభుత్వం మా బాధలు గుర్తించి శాశ్వత పరిష్కారం చూపింది. పోడు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు.
– పూనెం భిక్షపతి, వట్టంవారిగుంపు, కరకగూడెం మండలం
పోడు భూముల పట్టాల కల నేటితో నెరవేరింది. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన మాట ప్రకారం పోడు రైతులకు పట్టాలు అందజేశారు. సీఎం కేసీఆర్తోనే రైతుల సంక్షేమం సాధ్యం. భవిష్యత్లో ఎటువంటి సమస్యకు తావులేకుండా పోడు పట్టా పాస్ పుస్తకాలు పకడ్బందీగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.
– పోలెబోయిన రంగయ్య, కల్వలనాగారం, కరకగూడెం మండలం
అశ్వాపురం, జూలై 3 : తమకు పట్టాలు ఇవ్వడంపై హర్షం వ్య క్తం చేసిన పోడు రైతులు మొండికుంట గ్రామంలో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఇన్నేళ్లు తమ భూముల్లో తామే నేరస్తుల్లా బిక్కుబిక్కుమంటూ వ్యవసాయం చేసుకుంటూ అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోడు రైతులకు సర్వ హక్కులు కల్పిస్తూ.. పట్టాలు ఇచ్చి హక్కుదారులుగా చేయడం మంచి పరిణామమన్నారు. పోడు భూమిలో వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వేసిన సీఎం కేసీఆర్కు పోడు రైతుల పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్, పాయం సీతారాములు, లాలయ్య, వెంకన్న, భద్రం, శ్రీను, పొట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఏళ్లతరబడి ఎదురు చూస్తున్న పోడు భూములకు పట్టాలు రావడంతో మా కల నెరవేరింది. చాల సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే మెచ్చాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్లీ సీఎం కేసీఆర్ను అధికారంలోకి తీసుకువచ్చి రుణం తీర్చుకుంటాం.
-బేతి లక్ష్మణరావు, ఉట్లపల్లి, అశ్వారావుపేట మండలం
15 ఏళ్లగా పోడు భూముల సమస్య ఉంది. ఇన్నాళ్లకు ఈ సమస్యకు పరిష్కారం లభించింది. పట్టా హక్కులతోపాటు రైతుబంధు, రైతుబీమా రావడం చాలా సంతోషంగా ఉంది. గిరిజనులు సీఎం కేసీఆర్ను ధైవంగా చూడాలి. అందరి ఇళ్లలో పండుగ చేసుకునే విధంగా చేశారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– కె.రాజమ్మ, కేశప్పగూడెం, అశ్వారావుపేట మండలం
పోడు భూముల పట్టా సమస్య గురించి ఎన్నో ఏండ్లుగా ఎంతో మందికి మొరపెట్టుకున్నాం. పెద్ద సార్లను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. పోడు రైతుల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ సార్ పట్టాలు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్ల సమస్యకు పరిష్కారం చూపి పట్టాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఊకే చిన్నక్క, కన్నాయిగూడెం, కరకగూడెం మండలం