అశ్వారావుపేట, జనవరి 6 : ఆయిల్పామ్ గెలల దిగుబడికి అనుగుణంగా ఫ్యాక్టరీల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ స్పష్టం చేశారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో కొత్త సాగుతో మొత్తం 89 వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతుందన్నారు. వచ్చే ఏడాది మరో 20 వేల ఎకరాల్లో సాగు విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో ఉమ్మడి జిల్లాలోనే 15 వేల ఎకరాల్లో సాగు విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి మొక్కల కొరత లేదని, ఆయిల్ఫెడ్ పరిధిలో 11 నర్సరీల ద్వారా మొక్కల ఉత్పత్తి కొనసాగుతున్నదన్నారు. కొత్త ప్లాంటేషన్ల నుంచి లభించే దిగుబడులకు అనుగుణంగా కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికే అప్పారావుపేట ఫ్యాక్టరీని 90, అశ్వారావుపేట ఫ్యాక్టరీని 30 టన్నుల సామార్థ్యానికి పెంచినట్లు చెప్పారు.
అలాగే సిద్దిపేట ఫ్యాక్టరీతోపాటు ఖమ్మం జిల్లా కల్లూరిగూడెంలో 2026 నాటికి మరో ఫ్యాక్టరీని రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆయిల్ ఇయర్లో ఫార్ములాను 19.02 శాతంగా నిర్ణయించామని, గత ఏడాది 19.32 శాతం ఉన్న ఫార్ములా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. కాగా.. ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించారు. అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఎంఈఈ ప్లాంట్, 90 టీపీహెచ్, 30 టీపీహెచ్ బాయిలర్ పనులను తనిఖీ చేశారు. అనంతరం నర్సరీని సందర్శించిన ఆయన మొక్కల నాణ్యతను పరిశీలించి పంపిణీ ప్రక్రియను పెంచాలని, అడిగిన రైతులందరికీ మొక్కలు సరఫరా చేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి అశ్వారావుపేట ఫ్యాక్టరీకి చేరుకుని రెండో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయన వెంట ఆయిల్ఫెడ్ జీఎం టి.సుధాకర్రెడ్డి, పీఅండ్పీ మేనేజర్లు శ్రీకాంత్రెడ్డి, జెన్ను సత్యనారాయణ, ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, దమ్మపేట ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.