రఘునాథపాలెం, ఆగస్టు 27 : ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదలు వేసుకున్న రేకుల షెడ్లు, గుడిసెలను పోలీసులు మంగళవారం జేసీబీలతో తొలగించేందుకు యత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెవెన్యూ సర్వే నెంబర్ 148, 149లో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లకు తొలగించేందుకు పోలీసులు జేసీబీలతో రంగప్రవేశం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పేదలు షెడ్ల కూల్చివేత యత్నాన్ని అడ్డుకున్నారు. జేసీబీలకు అడ్డంగా నిల్చొని కూల్చివేతలను నిలువరించారు.
ఏసీపీ రమణమూర్తి, పలువురు సీఐలు మైక్ ద్వారా ఎంతగా వారించి.. హెచ్చరికలు జారీ చేసినా ఏమాత్రం తగ్గలేదు. ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని నిరుపేదలు నిలదీశారు. పట్టా భూములను ఆక్రమించి షెడ్లు నిర్మించడం సరికాదని, మీతో షెడ్లు వేయించిన నాయకులకు రెండు నెలలుగా తొలగించాలని చెప్పిన విషయాన్ని ఏసీపీ రమణమూర్తి మైక్ ద్వారా పేదల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన పేదలు తమకు రెండు రోజుల గడువు కావాలని, స్వచ్ఛందంగా షెడ్లను తొలగిస్తామని ఏసీపీని వేడుకున్నారు. దీనికి నిరాకరించిన పోలీసులు మరోమారు యంత్రాలతో రేకుల షెడ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
కాగా.. షెడ్ల తొలగింపులో పోలీసుల ప్రయత్నం విఫలం కావడంతో పట్టా భూమి యజమానులు వంద మందికి పైగా రౌడీమూకలను రంగంలోకి దించారు. ఒక్కసారిగా రేకుల షెడ్ల ప్రాంతం వద్ద ప్రత్యక్షమైన అల్లరిమూకలు మద్యం మత్తులో అక్కడున్న పేదలు భయబ్రాంతులకు గురయ్యేలా హడావుడి చేశారు. షెడ్లను ఇష్టారీతిగా తన్నుతూ.. పిడిగుద్దులు గుద్దుతూ పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ తొలగింపు చర్యలు చేపట్టారు. అయినా తమ షెడ్లను కాపాడుకునేందుకు రౌడీమూకలను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు ఆపలేదు. ఇదంతా పోలీసుల కళ్లముందే జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్ర పోషించారు. ఒకపక్క వారిని అడ్డుకున్నట్లు ప్రయత్నిస్తూనే.. మీ పని మీరు చేయండి అంటూ సైగలు చేయడం కనిపించింది. దీంతో పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రౌడీమూకల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడ్డుకోబోయిన మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ షెడ్లను తొలగించడం కనిపించింది.
భూదాన్ భూమి పేరుతో తమ వద్ద కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకొని రేకుల షెడ్లు వేయించారని బాధితులు ఆరోపించారు. పది మంది నాయకులుగా చలామణి అవుతూ తమ వద్ద రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు తీసుకొని తమతో దగ్గరుండి మరీ 100 గజాల చొప్పున జాగా చూపించి షెడ్లు వేయించారని వాపోయారు. తీరా మాతో వేయించిన భూమి పట్టా అని తేలడంతో మోసపోయామని గుండెలు బాదుకుంటూ నిరుపేదలు రోదిస్తుండడం కనిపించింది.