కొత్తగూడెంలో నర్సింగ్ కాలేజీ రెడీ అయింది. కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయ నిర్వహణలో ప్రభుత్వం కొనసాగనున్నది. ఇప్పటికే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి జనవరి పదోతేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది. ఆ తర్వాత 1, 2, 3 విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ):మన్యానికి నర్సింగ్ కాలేజీ వరమైంది. కొత్తగూడెం మెడికల్ కాలేజీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ నర్సింగ్ కాలేజీని మంజూరు చేసింది. కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయ నిర్వహణలో కొత్తగూడెం నర్సింగ్ కాలేజీ కొనసాగబోతోంది. ఇప్పటికే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి పదో తేదీ వరకు వెబ్ ఆప్షన్లు జరుగుతాయి. ఆ తరువాత 1, 2, 3 దశల కౌన్సెలింగ్ ద్వారా అవకాశాలు కల్పిస్తారు. ప్రస్తుతం నర్సింగ్ కాలేజీకి సొంత భవనం లేనందున అద్దె భవనంలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లేదు. ఈ కాలేజీ ప్రారంభమైతే మొదలైతే ఇదే మొదటి నర్సింగ్ కాలేజీ అవుతుంది.
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇందులో భాగంగా సర్కారు దవాఖానలో నర్సులను ఎప్పటికప్పుడు రిక్రూట్ చేస్తోంది. జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్న నర్సింగ్ కళాశాలలో నాలుగేళ్లు పూర్తయ్యేలోపు 60 మంది విద్యార్థులు నర్సింగ్ పూర్తి చేయన్నారు. వారంతా ప్రైవేటు, ప్రభుత్వ వైద్యశాలల్లో ఏజెన్సీవాసులకు వైద్య సేవలు అందించనున్నారు. గతంలో నర్సింగ్ చదవాలనుకునే వారు రూ.వేలు వెచ్చించి ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లాల్సి వచ్చేది.
నర్సింగ్ మొదటి సంవత్సరంలో చేరేందుకు విద్యార్థులకు గురువారం నుంచి 10వ తేదీ వరకు అవకాశం ఉంది. అప్పటి వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. 60 మంది విద్యార్థులతో జనవరిలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ భవనం తరగతుల నిర్వహణకు సిద్ధమైంది. విద్యార్థులకు ప్రభుత్వం హాస్టల్ వసతి కల్పిస్తోంది. ఇప్పటికే ప్రిన్సిపాల్ను, వైస్ ప్రిన్సిపాల్ను నియమింది.
జనవరి నుంచి నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ తరగతులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం అధికారులు తనిఖీలు నిర్వహించి అనుమతులిచ్చారు. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ఈ నర్సింగ్ కాలేజీలో 60 మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం విద్యనభ్యసిస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీకి మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి కానుంది. 2, 3 విడతల్లో కూడా కౌన్సెలింగ్ నిర్వహించి ఎంపికల ప్రక్రియను పూర్తి చేస్తారు. వెబ్ ఆప్షన్లలో సీటు అలాట్ అయిన వారు జనవరి నుంచి తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.
-పులిపాటి జ్యోతి, ప్రిన్సిపాల్, నర్సింగ్ కాలేజీ