ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 3 : ఇంటర్మీడియట్ అనంతరం ఎంపిక చేసుకునే కోర్సు, కళాశాల ఆధారంగానే ఉజ్వల భవితకు అడుగు పడుతుందని కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జే.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికీ ఇంటర్ చదువు కీలకమని, జీవితం ఏ రంగంలో స్ధిరపడాలన్నా కేంద్ర బిందువు ఇదేనని అన్నారు. లక్ష్యం ఎంపిక కూడా అదే తరహాలో ఉండాలని, అలాంటి ఎంపికకు సరైన కేంద్రబిందువు కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అని విద్యార్థులకు సూచించారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ‘కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2023’ పేరిట ఇంటర్ విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రొఫెసర్ డాక్టర్ షణ్ముఖరావు, శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఏజీఎం గోపాలకృష్ణతో కలిసి కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జే.శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇంటర్ తర్వాత ఎలాంటి ఉన్నత విద్యనభ్యసించాలి? ఎక్కడ చదవాలి? ఎలా చదవాలి? అనే సంకోచంలో చాలామంది విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్ను వ్యర్థం చేసుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం అనేకమంది విద్యార్థులు ఇంజినీరింగ్ చేస్తున్నప్పటికీ నైపుణ్యం లేకుండానే డిగ్రీలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన కాలేజీని ఎంచుకొని కష్టపడితే సర్టిఫైడ్ ఇంజినీర్లు కాకుండా, క్వాలిఫైడ్ ఇంజినీర్లుగా ఎదగవచ్చని చెప్పారు. రూ.లక్షల జీతాలతో జీవితాల్లో స్థిరపడవచ్చని వివరించారు.
విద్యార్థుల ఉన్నత భవిష్యత్ కోసం తమ యూనివర్సిటీని ఎంచుకోవచ్చని ధీమాగా చెబుతున్నామన్నారు. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు తమ యూనివర్సిటీలో విద్యాలక్ష్మిని పథకాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇక్కడ ఒక కోర్సులో డిగ్రీ చదువుతూ, మరో రెండు కోర్సుల్లో డ్యుయల్ డిగ్రీ చదువుకునే అవకాశముందని అన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారని, ఇప్పటి వరకు అత్యధికంగా రూ.60 లక్షల వేతనం తీసుకుంటున్నారని వివరించారు. కార్యక్రమ ప్రారంభంలో శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన బృంద నృత్యాలు ఆకట్టుకున్నాయి. పలువురు విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ముగింపులో లక్కీ డ్రాలో ఎంపికైన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, డిప్యూటీ మేనేజర్ బోయిన శేఖర్బాబు, సర్కులేషన్ మేనేజర్ కే.రాంబాబు, నమస్తే తెలంగాణ బృంద సభ్యులు పాల్గొన్నారు.
కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించి రూ.లక్షల వేతనాలతో జీవితంలో స్థిరపడాలంటే సర్టిఫైడ్ ఇంజినీర్లుగా ఉండరాదని, గూగుల్లో ఉద్యోగాలు సాధించే స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. అలాంటి అద్భుత అవకాశాలు కేఎల్ యూనివర్సిటీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఉన్నాయన్నారు. నాలుగో సంవత్సరం ఇంటర్న్షిప్ నిర్వహిస్తున్నామన్నారు. మేజర్ డిగ్రీ, మైనర్ డిగ్రీ కోర్సులు ఉన్నాయని, మొదటి సంవత్సరంలో ఏ కోర్సులో చేరినప్పటికీ రెండో సంవత్సరంలో కోర్సు మారే అవకాశం ఉందన్నారు. మా వద్ద చదివిన విద్యార్థులకు వంద శాతం ఉన్నత వేతనంతో ప్లేస్మెంట్ వస్తున్నదన్నారు. విద్యార్థులు వాళ్ల పేరెంట్స్తో కలిసి మా క్యాంపస్ను పరిశీలించి భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. సాధారణ విద్యార్థులు సైతం రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్నారని, కళాశాల ఎంపికతోనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. బైపీసీ విద్యార్థులు సైతం ఇంజినీరింగ్ కోర్సులను అభ్యసించవచ్చని, క్వాలిఫైడ్ ఇంజినీర్లను కేఎల్ యూనివర్సిటీ తయారుచేస్తుందని స్పష్టం చేశారు. మంచి కళాశాలను ఎంపిక చేసుకోకపోతే ఉన్నత చదువులు చదివి కూడా నైపుణ్యాలు లేక చిన్నచిన్న వేతనాలకే పనిచేయాల్సి వస్తోందని వివరించారు.
–కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు
ఇంటర్ విద్య ఎంతో కీలకం..
విద్యార్థులకు ఇంటర్ దశ ఎంతో కీలకమని కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షణ్ముఖరావు పేర్కొన్నారు. ఈ దశలో భవిష్యత్కు సంబంధించి ఉత్తమ నిర్ణయం తీసుకోవాలన్నారు. కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్హత పరీక్ష రాసిన విద్యార్థులకు అద్భుత అవకాశాలున్నాయని వివరించారు. ఇంజినీరింగ్ విద్య ఎంతో కీలకమైనప్పటికీ దానిపై సరైన అవగాహన లేక విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. దేశంలో ఐఐటీ, ఎన్ఐటీలకు దీటుగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బోధన సాగిస్తూ సాంకేతిక విద్య అందిస్తోందని వివరించారు. అత్యుత్తమ ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, జీవితంలో స్థిరపడేలా భరోసా కల్పిస్తున్నామని అన్నారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం బోధన అందిస్తూ విద్యార్థి భవిష్యత్కు బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు.
–డాక్టర్ షణ్ముఖరావు, ప్రొఫెసర్, కేఎల్ యూనివర్సిటీ