ఖమ్మం కల్చరల్, ఫిబ్రవరి 7: ఖమ్మం నగరంలోని గుట్టలబజార్ శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సోమవారం వైభవంగా వాసవీమాత మహోత్సవాలు జరిగాయి. మూడురోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలు సోమవారంతో ముగిశాయి. గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి శ్రీకమలానంద భారతీస్వామి చేతుల మీదుగా ఆలయ గాలి గోపుర కలశ ప్రతిష్ఠ జరిగింది. తొలుత ఆలయ కమిటీ చైర్మన్ మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, పాలక మండలి సభ్యులు శ్రీకమలానంద భారతీస్వామి, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మశ్రీ ఎల్వీ గంగాధర శాస్త్రికి స్వాగతం పలికారు. రామ మందిరం, గీతా మందిరాల ప్రారంభోత్సవం నిర్వహించారు. కమలానంద భారతీస్వామి మాట్లాడుతూ.. హైందవ ధర్మ పరిరక్షణకు ఆలయాల వైభవమే ప్రతీక అన్నారు. గాలి గోపురం అత్యంత మహిమాన్వితమైందన్నారు. కలశ ప్రతిష్ఠతో ప్రజలంతా సుభిక్షంగా ఉంటారన్నారు. బ్రహ్మశ్రీ ఎల్వీ గంగాధరశాస్త్రి మాట్లాడుతూ.. శ్రీకృష్ణ భగవానుడిని సేవిస్తే సమస్త లోకానికి మంచి జరుగుతుందన్నారు. అనంతరం మహా సహస్ర అవధాని, ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు హైందవ ధర్మ విశిష్టతను వివరించారు. ఆయన్ను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సన్మానించారు. ప్రముఖ వైద్య నిపుణుడు గెల్లా విశ్వనాథ్, పాలకమండలి గౌరవ సలహాదారులు చెరుకూరి కృష్ణమూర్తి, గెల్లా అమర్నాథ్, దేవత అనీల్కుమార్, కొత్తమాసు హేమసుందర్రావు, చిన్ని కృష్ణారావు, బిజ్జాల ఈశ్వరరావు, దుగ్గి శ్రీనివాస్, మద్ది వెంకట వీరభద్రరావు, గోళ్ల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.