కూసుమంచి, ఫిబ్రవరి 11: పొద్దుగాల లేచిన దగ్గర్నుంచి పశువులు కసువు తీయడం, వాకిలి ఊకడం, కళ్లాపు చల్లడం, గేదెలు, ఆవుల నుంచి తీసిన గుమ్మపాలను ఆవురు ఆవురంటూ తాగడం, చద్దన్నంలో మజ్జిగ, గంజన్నం, రాగి జావ, జొన్నరొట్టెలు, అంబలి ఇలా ఇంట్లో ఏది ఉంటే అది తెల్లవారుజామునే తినడం, పొద్దుపొడవకముందే పొలాలకు వెళ్లి పనిచేయడం, చమటోడ్చడం, ఏ పనికి బయటకు నడిచేవెళ్లడం.. ఇలా కారణాలు ఏమైతేనేమి..? 90 ఏళ్లు దాటినా ఇప్పటికీ తమ పనులు తామే సొంతంగా చేసుకునే వాళ్లు మన కళ్ల ముందే కనిపిస్తుంటారు.
30 ఏళ్లు దాటితేనే కిలోమీటర్ నడవలేని మనుషులు ఉన్న ఈ కాలంలో ముదిమి వయసులో సైకిల్ తొక్కుతూ రోడ్డుపై కనిపించే వాళ్లను మనం చూస్తుంటాం. వీధి అరుగున కూర్చొని బియ్యంలో రాళ్లు ఏరుతూ కనిపించే వృద్ధురాళ్లను చూస్తుంటాం. వారిని ఏ రోజూ మనం పలకరించం. బాల్యం, యౌవనంలో వారి ఆహార అలవాట్ల గురించి తెలుసుకోం. వారి స్ఫూర్తిగా తీసుకుని ఒక ముందడుగు వేయం. వారిని కదిలిస్తే ఎన్నో విశేషాలు మనకు తెలుస్తాయి. నాటి ఆహారపు అలవాట్లు, జీవన శైలి గురించి ఎన్నో విషయాలు బహిర్గతమవుతాయి. అలాంటి ప్రయత్నమే ‘నమస్తే’ చేసింది. కూసుమంచి మండలానికి చెందిన పలువురు ‘దీర్ఘాయుష్మంతుల’ మనోగతం తెలుసుకున్నది.
‘రా’ ఫుడ్.. వారి హెల్త్ సీక్రెట్..
90 ఏళ్లు వచ్చినా వారి శారీరక పటుత్వానికి కారణం నాడు దొరికిన ఆహారమేనని ఘంటాపథంగా వెల్లడిస్తున్నారు వృద్ధులు. 19వ శతాబ్దం ఆరంభంలో దేశాన్ని కరువు కటకాలు పట్టిపీడించేవి. నాడు దేశమంతా బ్రిటీష్ పాలన ఉండేది. అప్పుడు మన ప్రాంతం నైజాం పాలనలో ఉండేది. నాడు కరువు కాటకాలు తాండవించేవి. వరి అన్నం తినడమంటే ఆ రోజు వారికి పండుగే. దీంతో అప్పటి ప్రజలు స్థానికంగా తక్కువ ధరకు దొరికే జొన్నలు, సజ్జలు, రాగులే వారి ప్రధాన ఆహారం. గటక, అంబలి, జావ తాగి రోజంతా చమటోడ్చేవారు. శారరీక శ్రమ వారికి వ్యాయామంలా ఉపయోగపడింది. పస్తులుండాల్సిన రోజులు వస్తే అతితక్కువ తిండితో జీవనం ఎలా సాగించాలో తెలిసిన మనుషులు వాళ్లు. ఇదంతా ప్రకృతి సిద్ధంగా ఉండడంతోనే వారిని వ్యాధులు పీడించలేదు. ఒకవేళ వచ్చినా వాటిని జయించారు. కలరా మహమ్మారి వచ్చిన సమయంలో ఎక్కువమంది ప్రాణాలు వదిలారు. మహమ్మారి నుంచి బయటపడి బతికి బట్ట కట్టిన వాళ్లు దీర్ఘాయుష్మంతులయ్యారు. వీళ్లే కరోనా మహమ్మారిని సైతం జయించారు.
మరి నేడూ…??
కాలచక్రం గిర్రున తిరిగి 90 ఏళ్ల పడి దాటినా ఇప్పటికీ ఉత్సాహంగా ఎంతోమంది వృద్ధులు జీవిస్తున్నారు. కానీ నేటి తరం, ముందు తరం మాత్రం రోగాలు రొప్పులతో బాధపడుతున్నారు. రసాయనిక ఎరువులు వాడి పండించిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ఫుడ్, మసాలాలు దట్టించిన బిర్యానీలు, డీప్ ఫ్రై చేసిన వేపుళ్లు చేసిన ఆహారం తిని చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ పాలవుతున్నారు. నిండా 30 ఏళ్లు నిండని యువత నిద్రలేమి, యాైంగ్జెటీ, కంటి చూపు సమస్యల బారిన పడుతున్నారు. ఒక్కసారి ముందు తరాల జీవనశైలి గురించి తెలుసుకుని పాటిస్తే మనమూ అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చు. అందుకు సజీవ సాక్ష్యమే ఈ వృద్ధులు.
ఇప్పటికీ రోజుకు 20 కిమీ సైకిల్ తొక్కుతా
నా వయస్సు సుమారు 96 ఏండ్లు. ఇప్పటికీ నేను రోజుకు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతా. బయట ఏ పని ఉన్నా నేను సైకిల్ మీదే వెళ్తా. ఇప్పటికీ ప్రతిరోజూ పేపర్ చదువుతా. రాజకీయయ వార్తలంటే నాకు ఆసక్తి. నాకు బీపీ, షుగర్ లేవు. నా గురించి మా మండలమంతా తెలుసు. నేను అప్పట్లో పెద్దబాలశిక్ష చదివా. మా చిన్నప్పుడు పంటలు సరిగా పండేవి కాదు. రోజూ గటక తినేవాళ్లం. దొరకకపోతే రోజుల తరబడి పస్తులు ఉండేవాళ్లం. నాడు మేము దంపుడు బియ్యం, పురుగు మందులు వాడకుండా పండించిన కూరగాయలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలన్నం తిని ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాం.
– కొరెట్ల పాపాయ్య, వృద్ధుడు, గైగొళ్లపల్లి, కూసుమంచి మండలం
సైకిల్పై నాగార్జున సాగర్ వెళ్లా..
నాకు సుమారు 98 ఏళ్లు నిం డాయి. మా చిన్నతనంలో మేము తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచే వాళ్లం. పేడకళ్లు తీసేవాళ్లం. తెల్లవారిన తర్వాత పశువులను మేపేందుకు బీళ్లకు వెళ్లేవాళ్లం. జొన్నలు, సజ్జలు, ఒరిగెలు,కందులు, కొర్రలతో వండిన జావ, అంబలి, అన్నాన్ని తినేవాళ్లం. నాడు బియ్యం దొరికిందంటే ఇక ఆరోజు ఇంట్లో పండుగ వాతావరణమే. చిరుతిండ్ల కింద రేగిపండ్లు, అలసందలు, పరిగపండ్లు తినేవాళ్లం. నేను 1960వ దశకం నుంచి సైకిల్ తొక్కుతున్నాను. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వస్తున్నారని తెలిసి కూసుమంచి నుంచి సైకిల్ తొక్కుతూ నాగార్జున సాగర్ వెళ్లా. అలాగే విజయవాడ, ఖమ్మంలో పనులు ఉంటే సైకిల్ మీదే వెళ్లేవాడిని. పెద్ద బాలశిక్ష చదివి లోకజ్ఞానం తెలుసుకున్నా. ఆరోజులు తిరిగి రావు.
– దేవులపల్లి శివరామయ్య, వృద్ధుడు, కూసుమంచి
గటక.. జొన్న బువ్వే మాకు తిండి..
మా చిన్నతనంలో వరి అన్నం దొరికేది కాదు. మా తిండి గటక, సజ్జన్నం, బువ్వ సంకటే మా ఆహారం. అప్పటి కరువు కాటకాల కారణంగా మాకు రోజుల తరబడి అన్నం దొరికేది కాదు. ఊర్లో దొరికే సజ్జలు, జొన్నలే గతి. నాకు వందేళ్లు వస్తున్నాయి. ఇప్పటికీ నేను నా పనులు నేను చేసుకుంటున్నా. నాకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. నా కళ్ల ఎదుటే ఇద్దరు కొడుకులు కాలం చేశారు. అయినా.. ఆత్మవిశ్వాసంతో బతకుతున్నా.
– మందా భద్రమ్మ, వృద్ధురాలు, కూసుమంచి
రోజంతా శ్రమ..
నాకు వందేళ్లు ఉంటాయి. చిన్నప్పుడు మా ఇంటి నిండా పిల్లలు ఉండేవారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లందరితో ఇల్లు కళకళలాడేది. మేము మొత్తం 10 మంది సంతానం. నాడు కట్టెల పొయ్యి మీదే వంట. జొన్న గటక తినేవాళ్లం. గడ్డ పెరుగు దొరికేది. ఇప్పటి పిల్లలు మూడు పూటల తినడానికి ఇబ్బందిపడుతున్నారు. మా కాలంలో రోజంతా చేనులో కష్టపడేవారు. రోజుకు నాలుగైదు సార్లు తినే వాళ్లూ నాకు తెలుసు. నాకు తొమ్మిది మంది పిల్లలు. నేను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు పొలం పనులకు వెళ్లా.
– పాలేటి వీరమ్మ, వృద్ధురాలు, మల్లేపల్లి, కూసుమంచి మండలం