రఘునాథపాలెం, అక్టోబర్ 30: ఖమ్మం నగరంలోని సర్ధార్ పటేల్ స్టేడియం వేదికగా పొంగులేటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మూడ్రోజులుగా జరిగిన కబడ్డీ టోర్నమెంటు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని సత్తా చాటారు. డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో రసవత్తరంగా సాగాయి. ఈ పోటీలను తిలకించేందుకు ఖమ్మం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు, క్రీడాకారులు పెద్దఎత్తున తరలివచ్చారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు పీఎస్ఆర్ ట్రస్ట్ బాధ్యులు భోజనం, వసతి కల్పించారు. ఆదివారం సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళల విభాగంలో నల్లగొండ-రంగారెడ్డి జట్లు, పురుషుల విభాగంలోనూ నల్లగొండ-రంగారెడ్డి జట్లు ఫైనల్కు చేరి తలపడ్డాయి. ఆఖరిరోజు పోటీలకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఫైనల్ ప్రారంభమైన సమయంలో క్రీడా ప్రాంగణం ప్రేక్షకుల కేరింతలతో దద్దరిల్లింది. రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఫైనల్కు చేరిన మహిళలు, పురుషులకు చెందిన నల్లగొండ, రంగారెడ్డి జట్లు ఆడుతున్న కబడ్డీని మాజీ ఎంపీ పొంగులేటి ఆసక్తిగా తిలకించారు.
విజేతలకు బహుమతులు అందజేసిన ‘పొంగులేటి’
పోటీల్లో గెలుపొందిన మహిళలు, పురుషుల విభాగంలోని నల్లగొండ జిల్లాకు చెందిన విజేత జట్లకు మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ట్రోఫీతోపాటు రూ.లక్ష నగదును అందజేశారు. వారితోపాటు మరో ఏడుగురికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ క్రీడాకారుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో కబడ్డీ పోటీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోటీలు విజయవంతంగా నిర్వహించిన ట్రస్ట్ బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే జగదీశ్వర్ యాదవ్, డీవైఎస్వో పరంధామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తుంబూరి దయాకర్రెడ్డి, ట్రస్ట్ బాధ్యులు మువ్వా విజయ్బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, మద్దినేని బేబి స్వర్ణకుమారితోపాటు అనేక మంది పొంగులేటి అనుచరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో నేడు ముగింపు వేడుకలు
కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 30: జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా పీఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో మూడు రోజులుగా రాష్ట్రస్థాయి ఏడో జూనియర్ వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా క్రీడాకారులంతా తలపడుతున్నారు. నువ్వా.. నేనా అన్న రేంజ్లో పోటీలు జరుగుతున్నాయి. ఒక జిల్లా జట్టుపై మరొక జిల్లా జట్టు తలపడి ఎలాగైనా సరే తమ ప్రతినిధి టీమ్ని ఓడించాలంటూ కంకణబద్దులై అన్ని జట్ల క్రీడాకారులు పోటీలో తలపడుతున్నారు. బాలికలు, బాలుర జట్లు వేర్వేరుగా ఈ మ్యాచ్లో పాల్గొంటున్నాయి. తామేమీ తక్కువ కాదని… తాము కూడా ఆడగలం అంటూ బాలికల జట్లు ఆడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాలీబాల్ పోటీల్లో తలపడుతున్న బాలికలు, బాలుర జట్లను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాభిమానులు, క్రీడాకారులు తరలివచ్చారు. దీంతో ప్రకాశం మైదానం మొత్తం సందడి వాతావరణం నెలకొంది. మూడో రోజు ఉదయం జరిగిన మ్యాచ్లో బాలుర విభాగంలో ఏ- ఖమ్మం జట్టు హైదరాబాద్ జట్టుపై మొత్తం నాలుగు రౌండ్లలో మూడు రౌండ్లు గెలిచి ఖమ్మం జిల్లా విజయం సాధించింది. కరీంనగర్బీ జట్టు మెదక్ జట్టుపై నాలుగు రౌండ్లలో మూడు రౌండ్లు గెలుచుకుంది. మహబూబ్నగర్ ఏ జట్టు ఆదిలాబాద్ జట్టుపై నాలుగు రౌండ్లలో మూడు రౌండ్లను గెలుచుకుంది. వరంగల్ బీ జట్టు నల్లగొండ జట్టుపై ఘన విజయం సాధించింది. బాలికల విభాగంలో… రంగారెడ్డి ఏ జట్టు మెదక్ జట్టుపై, నల్లగొండ బీ జట్టు హైదరాబాద్ జట్టుపై, ఆదిలాబాద్ జట్టుపై ఖమ్మం ఏ జట్టు, కరీంనగర్ జట్టుపై మహబూబ్నగర్ బీ జట్టు విజయం సాధించింది. కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల రమేశ్బాబు, కార్యదర్శి హనుమంత్రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి గోవింద్రెడ్డి, కోశాధికారి ఉస్మాన్, రాష్ట్ర అధ్యక్షుడు గణపతి, రవీందర్రెడ్డి, ఎండీ అక్బర్, ఆలీ, వాలీబాల్ కోచ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ పీఎస్ఆర్ యూత్ సభ్యుడు చీకటి కార్తీక్, శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఎండీ గౌస్, జిల్లా కిరణ్, సుధాకర్రెడ్డి, జేవీ మోహన్, అజయ్, సతీశ్ పాల్గొన్నారు.