భద్రాచలం, డిసెంబర్ 17 : ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదో రోజు ఆదివారం రామయ్య వామనావతారంలో దర్శనమివ్వడంతో భక్తులు పరవశించిపోయారు. ఉదయం స్వామివారి ఉత్సవ మూర్తులు, నిత్యకల్యాణ మూర్తులను బేడా మండపంలో వేంచేపు చేసి అభిషేక తిరుమంజనం జరిపారు. స్వామివారి పన్నిద్రాళ్వార్లను ఆండాల్ అమ్మవారిని, కణ్ణన్ తండ్రిని, కనక సీతను, ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామివారిని అంతరాలయంలోనికి తీసుకెళ్లి వామనావతారంలో అలంకరించారు. బేడా మండపానికి తీసుకొచ్చి నాళాయిర ప్రబంధంలోని 200 పాశురాలను ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి నేతృత్వంలో ఆచార్య బ్రహ్మ ఋత్విక్లు అధ్యయనం చేశారు. ఆ తర్వాత అర్చకులు స్వామివారికి వివిధ రకాల హారతులను సమర్పించారు. రాజ భోగం నివేదన చేసి మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని ప్రత్యేక పల్లకిలో వేంచేపు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ గోదావరి తీరం వద్దకు తీసుకెళ్లి హారతులు సమర్పించి.. తిరిగి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. వామన రూపంలో ఉన్న స్వామివారిని పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారిని తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ ఎల్.రమాదేవి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, వేద పండితులు, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పర్ణశాలలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రామచంద్రుల వారు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్కుమార్, అనిల్కుమార్, శేష కిరణ్ కుమారాచార్యులు, భరద్వాజాచార్యులు, నరసింహాచార్యులు, రాము, శివ తదితరులు పాల్గొన్నారు.
అధ్యయనోత్సవాల్లో భాగంగా మిథిలా స్టేడియంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంకు చెందిన ఎం.బాలసుందరం భాగవతార్ చెప్పిన శ్రీకృష్ణ లీలలు హరికథ భక్తులను ఆకట్టుకుంది. రాత్రి 9 గంటలకు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన సుమిత్ర యూత్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకం అలరించింది. అలాగే పలు సంగీత కార్యక్రమాలు, కూచిపూడి నృత్యాలను కళాకారులు ప్రదర్శించారు.