భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల ఎంపీడీవో ఆఫీసులు పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లోని ఇరుకుగదుల్లో మండల పరిపాలన కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్థలాలను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం లేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినప్పటికీ కనీసం జిల్లా పరిషత్ కార్యాలయానికి సైతం కొత్త భవనం నిర్మించలేకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శమని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. ఇదిలాఉంటే ప్రజా సమస్యల పరిష్కారంలో మండల ప్రత్యేకాధికారులు విఫలమవుతున్నారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు రెండేళ్లుగా నిర్వహించకుండా కాంగ్రెస్ సర్కార్ తాత్సారం చేస్తుండడంతో ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల పాలన పూర్తిగా గాడితప్పింది.
– భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)
ప్రజలకు పరిపాలన చేరువ కావాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేయగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో పాలన గాడితప్పింది. కనీసం జిల్లా పరిషత్ కార్యాలయానికి కూడా కొత్త భవనాన్ని నిర్మించలేకపోయింది రేవంత్ ప్రభుత్వం. అదేకాక ఆరు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తే వాటికి కూడా మండల పరిషత్ కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేయలేకపోయింది. కొత్త భవనాల కోసం నిధులు మంజూరు చేయలేక అద్దె భవనాల్లోని ఇరుకు గదుల్లోనే కొనసాగిస్తున్నది. గత ప్రభుత్వంలో ఏర్పాటైన పాలకమండలి తప్ప నేటికీ కొత్త పాలకమండలిని సైతం ఏర్పాటు చేయలేకపోయింది. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక అధికారులు ఉన్నా వారు ఏదోశాఖకు జిల్లా అధికారికావడంతో వారి పనులతో సరిపుచ్చుకుంటున్నారు. దీంతో ఆయా మండలాల ప్రజలకు న్యాయం జరగడం లేదు. పాలన పూర్తిగా గాడితప్పింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీకాలం అయిపోయి రెండేళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే అనుమానంతోనే ఎన్నికలు నిర్వహించడంలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
కొత్త జిల్లా భద్రాద్రిలో ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలను ఏర్పాటు చేసి అక్కడ ఎంపీడీవోలను కూడా నియమించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఉన్న సర్కారు అప్పట్లో ఉన్న పాతభవనాల్లోనే కార్యకలాపాలు సాగిస్తున్నది. కొత్త భవనాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేకపోయింది. దీంతో ఆయా మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మండల కార్యాలయాలు నడిపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతోపాటు గతంలో భద్రాచలం మండలం జిల్లా పునర్విభజనలో రద్దయింది. తిరిగి దాన్ని మండలంగా చేసినా చివరికి అక్కడ కూడా ఎంపీడీవో పోస్టును మంజూరు చేయకపోవడంతో ఇన్చార్జితోనే మండల పరిషత్ను నడిపిస్తున్నారు. అదేగాక లక్ష్మీదేవిపల్లి మండలానికి కూడా ఎంపీడీవో పోస్టును ఇంతవరకు నింపలేదు.
గురుకులం స్కూల్లో మండల పరిషత్ ఆఫీసు పెట్టారు. ఆ భవనం పూర్తిగా పాడుబడింది. అందులోకి వెళ్లాలంటేనే భయంగా ఉంటోంది. కొత్త మండలాఫీసు ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. కనీసం కూర్చోడానికి కూడా అక్కడ సీటు ఉండదు. ఎంపీడీవో ఆఫీస్కు కొత్త భవనం నిర్మించాలి.
– ఇనపనూరి రాంబాబు, అన్నపురెడ్డిపల్లి మండలం
సుజాతనగర్ మండల కేంద్రం కొత్తగూడెం కార్పొరేషన్లో ఉంది. మండల ఆఫీసు కూడా సుజాతనగర్లోనే ఉంచారు. అదికూడా స్కూల్లో పెట్టారు. సొంత భవనం లేదు. మీటింగ్ పెట్టాలంటే అక్కడ సరిపడా స్థలం లేదు. మండలానికి అదే పేరు ఉంచుతారా లేక మారుస్తారా అన్న అనుమానం అందరిలో ఉంది.
– లావుడ్యా సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకుడు
కొత్త మండలాల కార్యాలయాలకు స్థలం ఉన్నట్లు ఎంపీడీవోలు రిపోర్టు ఇచ్చారు. ఆ ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు కూడా పంపాము. ఇంకా నిధులు మంజూరు కాలేదు. జిల్లాలో రెండు మండలాలకు ఎంపీడీవోలు లేరు. అదనపు బాధ్యతలు వేరే వాళ్లు నిర్వహిస్తున్నారు. జడ్పీ ఆఫీస్ను పాత భవనంలోనే నిర్వహిస్తున్నాం. నిధులు మంజూరు కాగానే కొత్త భవనాల నిర్మాణాలు జరుగుతాయి.
– నాగలక్ష్మి, జడ్పీ సీఈవో, భద్రాద్రి కొత్తగూడెం