ఎర్రుపాలెం, ఏప్రిల్ 15: 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని జమలాపురం వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబ శివరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల వారికి అనేక పథకాలు అందించామని, దేశంలోనే సాగునీరు, తాగునీరు సమృద్ధిగా సమకూర్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అధికారం చేపట్టి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గళం ఇచ్చి కేంద్ర ప్రభుత్వంపై పోరాడి రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేపడుతుందన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి ఓటు వేసి ఇప్పుడు తాము మోసపోయామని బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ చెప్పేది ఒక్కటి చేసేది ఒకటన్నారు. కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి నామా గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నామా గెలుపు ఒక మలుపు కావాలని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజానికానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్కు ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. సమావేశంలో తాళ్లూరి జీవన్కుమార్, చావా రామకృష్ణ, శీలం కవిత, పంబి సాంబశివరావు, మూల్పూరి శ్రీనివాసరావు, మదన్మోహన్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.