తిరుమలాయపాలెం, ఏప్రిల్ 22: మాయమాటలు చెప్పి అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసంచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతోనే మళ్లీ తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని పిండిప్రోలులో సోమవారం రాత్రి జరిగిన బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను ఏఒక్కటి అమలుచేయలేదని వివరించారు.
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. స్థానికుడినైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి గడిచిన నాలుగు నెలల్లో చేసింది శూన్యమని అన్నారు. పాలేరు రిజర్వాయర్ను ఎండబెట్టి రైతులకు నోట్లో మట్టికొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో బీసీ వ్యక్తి కూరాకుల నాగభూషణాన్ని డీసీసీబీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నారు.
గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్ని నిలిపివేశారని తెలిపారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. ప్రతి కుటుంబ సభ్యుడిగా మెలిగానని ఓడిపోవడం బాధ కలిగిందించదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల ప్రజలు బీఆర్ఎస్కు మద్దతు పలకాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రి వర్గంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తగిన ప్రాధాన్యత లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, డీసీసీబీ డైరెక్టర్ చావా వేణు, చామకూరి రాజు, ఆలస్యం నాగేశ్వరావు, సలీం పాల్గొన్నారు.